- ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లో ఇంటికి పార్శిల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల నుంచి భక్తుల ఇంటికే ప్రసాదాలను పంపేందుకు పోస్టల్ శాఖతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా పూజ సేవలతోపాటు పోస్టల్ప్రసాదం పంపే సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్లో పొందవచ్చన్నారు. ప్రసాదం హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు దగ్గర్లోని పోస్టు ఆఫీస్కు వెళ్లి బుక్ చేసుకోవచ్చన్నారు. ఆర్డర్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే ప్రసాదం ఇంటికి వచ్చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 1.60 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో ఈ సేవలను పొందొచ్చన్నారు. ఆలయ పూజ సేవల బుకింగ్ లను కూడా పోస్టల్ శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో పూజ సేవలను బుక్ చేసుకోలేని వారికోసం ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు.
ఈ ఆలయాల ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు
యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసర, కొండగట్టు, కొమురెల్లి, ఉజ్జయినీ మహంకాళి, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ప్రసాదాలను బుక్ చేసుకోవచ్చని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆయా దేవస్థానాల్లో జరిగే నిత్య ఆర్జిత సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తులు వారి గోత్ర నామాలతో ఆన్ లైన్ పూజల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని, టీయాప్ ఫోలియోలో బుక్ చేసుకోవాలన్నారు. దేవా దాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.