ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. సఫ్దార్ గంజ్ ప్రాంతంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లోకి వరద నీరు చేరింది. దీంతో పలు రైళ్లు రద్దయ్యాయి. మింటో బ్రిడ్జ్ సహా పలు అండర్ పాస్ రోడ్లలో భారీగా నీరు చేరడంతో ఆ మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. నోయిడా, ఆజాద్ పూర్, ప్రగతి మైదాన్, లాజ్ పత్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
ఢిల్లీలో భారీ వర్షానికి రాజ్ ఘాట్ లోనూ నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది వాతావారణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ అంతటా ఇవాల(శనివారం) ఆరెంజ్ అలర్ట్, రేపు(ఆదివారం) ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆగస్ట్ నెలలో ఢిల్లీలో ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం 13 ఏళ్లలో ఇదే మొదటి సారి.
