
- హౌజింగ్ కార్పొరేషన్ సెక్రటరీ అండ్ ఎండీ వీపీ గౌతమ్
కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో కామారెడ్డి జిల్లా టాప్లో ఉందని, ఇందుకు కృషి చేసిన కలెక్టర్, ఇతర అధికారులను రాష్ర్ట హౌజింగ్ కార్పొరేషన్ సెక్రటరీ అండ్ ఎండీ వీపీ గౌతమ్ అభినందించారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. భిక్కనూరు మండలం బస్వాపూర్లో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. మండల కేంద్రంలో ఫిల్టర్ రూప్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న మాడల్ ఇందిరమ్మ ఇల్లును, దోమకొండ మండలం గొట్టిముక్కులలో ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ చేసి మాట్లాడారు. నిర్మాణ పనుల కోసం క్లస్టర్ల వారీగా అధికారులను నియమించటం అభినందనీయమన్నారు.
ఫిల్టర్ రూప్ పద్ధతిలో నిర్మిస్తున్న మోడల్ ఇల్లు నార్మల్ ఇల్లు కంటే తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు కోఆర్డినేట్ చేసుకొని లబ్ధిదారులకు ఇసుక టోకెన్లు అందించాలన్నారు. ఇసుక, కంకర, ఇనుము, సిమెంట్, ఇటుకల ధరల నియంత్రణపై అధికారులు పర్యవేక్షించాలన్నారు. అన్ని ఏరియాల్లో పిల్లర్స్ అవసరం లేదన్నారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలన్నారు.
11,883 ఇండ్లు మంజూరు చేయగా, ఇందులో 5,721 ఇండ్లకు ముగ్గు పోశామన్నారు. 2,182 ఇండ్లు బెస్మిట్ లేవల్, 66 రూప్లేవల్, 1 కంప్లీట్ అయ్యిందన్నారు. 2,112 ఇండ్ల వరకు నిర్మించగా బిల్లులు చెల్లించామన్నారు. 431 ఇండ్లకు మహిళా సంఘాల ద్వారా లోన్ ఇచ్చారన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, హౌజింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, ఆర్డీవో వీణ, డీఈ సుభాష్, ఏఈలు, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
నిధుల సమస్య లేదు..
నిజామాబాద్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిధుల సమస్య లేదని హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన డిచ్పల్లి మండలం తిర్మన్పల్లి, డిచ్పల్లిలోని ఘన్పూర్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం కలెక్టరేట్లో జరిగిన మీటింగ్లో మాట్లాడారు. లబ్ధిదారులపై నిర్మాణ ఖర్చులు తగ్గేలా ఫ్రీ ఇసుక టోకన్లు అందించాలని, కంకర, ఐరన్, సిమెంట్, ఇటుకల రేట్స్ను మండల ధరల నియంత్రణ కమిటీ అదుపుచేయాలన్నారు.
నగరంలోని అభయహస్తం కాలనీలోని 4.32 ఎకరాల ల్యాండ్లో జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డిని కోరారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో జిల్లాలోని మండలాల వారీగా ఇండ్ల నిర్మాణాల పురోగతిని ఎండీకి చూపారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్, మెప్మా పీడీ రాజేందర్, హౌసింగ్ జిల్లా మేనేజర్ పవన్ ఉన్నారు.