
- మంజీరా, సింగూరు పైప్లైన్ల పక్కనే మరొక లైన్
- ఉస్మాన్సాగర్ కాండ్యూట్ను ఆనుకుని మరొకటి..
- తరచూ లీకేజీలతో నీటి వృథా, సరఫరాలో అంతరాయం
- కొత్త లైన్ల ఏర్పాటుకు ఓకే చెప్పిన సీఎం రేవంత్రెడ్డి
- ‘వ్యాప్కో’ కంపెనీకి సర్వే, డీపీఆర్ బాధ్యతలు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలోని తాగునీటి పైప్ లైన్లను ఆధునికీకరించేందుకు వాటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న భారీ పైప్లైన్లలో చాలా వరకు కాలం తీరినవే ఉన్నాయి. 50 కిలోమీటర్ల దూరం నుంచి మంజీరా, సింగూరు వాటర్తీసుకువస్తుండగా ఈ పైపులైన్లు వేసి దాదాపు యాభై ఏండ్లు దాటింది. 11 కిలోమీటర్ల దూరం నుంచి హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్నీటిని కాండ్యూట్ద్వారా ఆసిఫ్నగర్లోని ఫిల్టర్బెడ్స్కు తరలిస్తున్నారు. ఈ కాండ్యూట్నిజాం హయాంలో నిర్మించింది.
కాలం తీరిన పైప్లైన్లు కావడంతో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. తాగునీటి సరఫరాలో అంతరాయ కలుగుతోంది. ఈ క్రమంలోనే పైప్లైన్లను మార్చాలని వాటర్బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతమున్న పైప్లైన్లకు సమాంతరంగా కొత్త లైన్లు వేసి పాత వాటి నుంచి సరఫరా నిలిపివేయాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలోనే చేసినా కార్యరూపం దాల్చలేదు. బీఆర్ఎస్హయాంలో సింగూరు నుంచి నీటి సరఫరాను నిలిపివేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కొత్త పైపులైన్ల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే అధికారులు సీఎం రేవంత్దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా ఓకే చెప్పారని అధికారులు అంటున్నారు.
పూర్తిస్థాయిలో తరలించలేని పరిస్థితి
పైపులైన్ల లీకేజీల కారణంగా మంజీరా, సింగూరు నుంచి డ్రా చేస్తున్న నీటిలో 70 శాతమే నగరానికి తరలిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఆ టైంలో సింగూరు, మంజీరా పైప్లైన్లను 1972లో వేశారు. పూర్తిగా సిమెంట్పైపులను వినియోగించారు. 50 ఏండ్లు కావడంతో శిథిలావస్థకు చేరాయి. ఎక్కువ ప్రెషర్పెడితే లీక్అవుతున్నాయి. దీంతో ప్రెషర్తగ్గించి 70 శాతం నీటిని మాత్రమే తరలిస్తున్నారు. ప్రస్తుతం మంజీరా నుంచి 40.52 ఎంజీడీలు, 69.07 ఎంజీడీలు, ఉస్మాన్సాగర్ నుంచి 22.50 ఎంజీడీలు, హిమాయత్సాగర్ నుంచి 10.58 ఎంజీడీలు తీసుకువస్తున్నారు.
జంటజలాశయాల నుంచి డ్రా చేసిన నీరు కాండ్యూట్(కాలువ) ద్వారా గ్రావిటీతో ఆసిఫ్నగర్ఫిల్టర్బెడ్కు చేరుకుంటున్నాయి. దాదాపు 11 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కాలువలోకి నీరు వదిలితే 30 శాతం లీకేజీలతో వృథాగా పోతోంది. అందుకే కాండ్యూట్కు సమాంతరంగా మరో పైప్లైన్నిర్మించేలా ప్రతిపాదనలు చేశారు.
కొత్త టెక్నాలజీతో స్టీల్ పైపులు
వాటర్బోర్డు కొత్తగా సమాంతర పైప్లైన్ల నిర్మాణానికి సంబంధించి సర్వే, డిటెయిల్డ్ప్రాజెక్ట్రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసేందుకు ‘వ్యాప్కో’ సంస్థను కన్సల్టెన్సీగా నియమించిందని అధికారులు తెలిపారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వినియోగించిన కొత్త టెక్నాలజీతో ఎంఎస్పైపులు(స్టీల్పైపులు) ఉపయోగించి కొత్త లైన్లు వేయాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఈ సంస్థ ఇచ్చే ప్రపోజల్స్ఆధారంగా కొత్త లైన్లను నిర్మించేందుకు ప్లాన్లు రూపొందిస్తామంటున్నారు. వ్యాప్కో సంస్థ సర్వేలో ఎన్ని కిలోమీటర్ల మేర పైప్లైన్వేయాల్సి ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుందన్న పూర్తి నివేదికను అందజేస్తుందని అధికారులు తెలిపారు.