
బ్రిడ్జ్టౌన్: టెస్ట్ సిరీస్ జోరును టీమిండియా వన్డేల్లోనూ కంటిన్యూ చేసింది. రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3–2–6–4), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (6–0–37–3) స్పిన్ మ్యాజిక్ చేయడంతో.. గురువారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో రోహిత్సేన 1–0 లీడ్లో నిలిచింది. టాస్ ఓడిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 రన్స్కే కుప్పకూలింది. షై హోప్ (45 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 43) టాప్ స్కోరర్. తర్వాత ఇండియా 22.5 ఓవర్లలో 118/5 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (46 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 52) హాఫ్ సెంచరీ చేశాడు. కుల్దీప్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది.
బౌలర్లు అదుర్స్...
ముందుగా బ్యాటింగ్కు దిగిన కరీబియన్లను పేసర్లు హార్దిక్ (1/17), ముకేశ్ కుమార్ (1/22), శార్దూల్ ఠాకూర్ (1/14) దెబ్బకొట్టారు. తొలి స్పెల్ కట్టుదిట్టంగా వేయడంతో విండీస్ ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (17), కైల్ మేయర్స్ (2)తో పాటు, అలిక్ అథనాజే (22) రన్స్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డారు. చివరకు పాండ్యా బౌలింగ్లో స్లాగ్ స్వీప్ చేయబోయి మేయర్స్.. రోహిత్కు క్యాచ్ ఇచ్చాడు. ముకేశ్ బౌలింగ్లో అథనాజే కొట్టిన షాట్ను పాయింట్లో జడ్డూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఆ వెంటనే శార్దూల్ పర్ఫెక్ట్ ఇన్ కట్టర్తో కింగ్ను పెవిలియన్కు పంపాడు. దీంతో 9 ఓవర్లలోనే 45 రన్స్కే ఈ ముగ్గురు ఔటయ్యారు. ఈ దశలో హోప్ నిలకడగా బ్యాటింగ్ చేసినా, అవతలి వైపు అండగా నిలిచే వారు కరువయ్యారు. తర్వాత బౌలింగ్కు దిగిన జడేజా, కుల్దీప్ అద్భుతమైన టర్నింగ్, ఎక్స్ట్రా బౌన్స్తో హోమ్ టీమ్ లైనప్ను పేకమేడలా కూల్చారు. సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బందిపడిన హెట్మయర్ (11).. జడేజా బౌలింగ్లో స్కూప్ షాట్ ఆడి వెనుదిరిగాడు. కొద్దిసేపటికే రొవ్మన్ పావెల్ (4), రొమారియో షెఫర్డ్ (0) కూడా వికెట్లు ఇచ్చుకున్నారు. ఇక్కడి నుంచి కుల్దీప్ గూగ్లీలతో జోరందుకున్నాడు. వరుస విరామాల్లో హోప్తో పాటు డొమినిక్ డ్రేక్స్ (3), యానిక్ కారియా (3), జైడెన్ సీల్స్ (0)ను ఔట్ చేయడంతో విండీస్ చిన్న టార్గెట్ను నిర్దేశించింది.
కిషన్ మెరుపులు
ఛేజింగ్లో ఇండియా తడబడినా స్వల్ప టార్గెట్ కావడంతో గట్టెక్కింది. ఆరంభంలో ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించాడు. కరీబియన్ పేస్ బౌలింగ్లో చూడముచ్చటైన డ్రైవ్స్తో బౌండ్రీలు రాబట్టాడు. కానీ నాలుగో ఓవర్లోనే గిల్ (7) ఔట్కావడంతో ఇండియా 18 రన్స్కే తొలి వికెట్ చేజార్చుకుంది. సూర్యకుమార్ (19) టీ20 తరహాలో బ్యాటింగ్ మొదలుపెట్టినా ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు.
కొద్దిసేపటి తర్వాత హార్దిక్ పాండ్యా (5) కూడా రనౌట్గా వెనుదిరగడంతో ఇండియా స్కోరు 70/3గా మారింది. ఈ దశలో జడేజా (16 నాటౌట్)తో కలిసి ఇషాన్ వేగంగా ఆడాడు. 44 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి మోతీ (2/26) బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. దీంతో నాలుగో వికెట్కు 24 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. శార్దూల్ (1) ఫెయిలైనా, రోహిత్ (12 నాటౌట్), జడేజా విక్టరీని అందించారు.