
- జీహెచ్ఎంసీలో ఇప్పటికే 16 స్థలాల గుర్తింపు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఇతర పట్టణాల్లోనూ జాగాలు గుర్తించాలని అధికారులకు ఆదేశం
- గిరిజనులకు ప్రత్యేకంగా 22 వేల ఇండ్లు కేటాయించినట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న సొంత జాగా లేని ప్రజలకు జీ ప్లస్ 3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. పట్టణాల్లోని స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలు.. అక్కడే ఉంటామని, దూరంగా ఇండ్లు ఇస్తే తమ ఉపాధికి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నందున ఈ చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పై హౌసింగ్ అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్ కు దూరంగా గతంలో 42 వేల ఇండ్లను నిర్మించగా19 వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారని.. ఇటీవల క్షేత్ర స్థాయిలో పరిశీలించగా కేవలం13 వేల మంది మాత్రమే ఆ ఇండ్లలో ఉంటున్నట్లు తేలిందని మంత్రి వెల్లడించారు.
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పట్టణ ప్రాంతాలలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని మురికి వాడల్లో పేదలు ఉన్నచోటే జీ+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలివిడతలో హైదరాబాద్లో 16 మురికివాడలను గుర్తించామని చెప్పారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏండ్ల తరబడి నిలువ నీడలేక, తలదాచుకోవడానికి గూడు లేని చెంచులకు సీఎం ఆదేశాల మేరకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు నాలుగు ఐటీడీఏల పరిధిలోని చెంచు, కొలాం, తోటి, కొండ రెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలోని16 ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా 8,750 ఇండ్లు మంజూరు చేశామని మొత్తం కలిపి గిరిజనులకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యారు. తక్షణమే లబ్ధిదారులను గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.