
- ప్రస్తుతానికి 5,216 మంది నిర్వాసితుల్లో 3,300 మంది గుర్తింపు
- ఎంపీడీవోలకు చేరిన ఫస్ట్ ఫేజ్ లిస్ట్
సంగారెడ్డి, వెలుగు: జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి (నిమ్జ్) భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించనున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం, న్యాల్కల్ మండలాల పరిధిలో ఏర్పాటు కానున్న నిమ్జ్ కోసం 12,635 ఎకరాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణలో భూ సేకరణ చేపడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 7,300 ఎకరాలను సేకరించగా ఇంకా 5,325 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అర్హులైన నిర్వాసితులకు ఒకే చోట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. నిమ్జ్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా బహిరంగ సభలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చిన హామీని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించగా భూములు కోల్పోయిన నిర్వాసితుల మొదటి విడత జాబితాను అధికారులు తయారు చేశారు. ఇప్పటివరకు సేకరించిన భూముల లెక్కల ప్రకారం 5,612 మంది నిర్వాసితులు ఉండగా వారిలో 3,300 మంది జాబితాను భూసేకరణ స్పెషల్ డిప్యూటీ ఆఫీసు అధికారులు సంబంధిత ఎంపీడీవోలకు అప్పగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఎంపీడీవోల కసరత్తు షురూ
నీమ్జ్ భూసేకరణ అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం ఇండ్లు పొందేందుకు ఎంతమంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారనేది ఎంపీడీవోలు తేల్చనున్నారు. ఇందులో అర్హులు, అనర్హులు ఎంతమంది ఉన్నారనే దానిపై కసరత్తు చేస్తున్నారు. భూములు కోల్పోయిన వారిలో కొందరు హైదరాబాద్, బీదర్, సంగారెడ్డి ప్రాంతాల్లో సెటిలైనట్లు అధికారులు గుర్తించగా మరి కొందరు స్థానికంగా ఉంటూనే ఇతరత్రా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
స్థానికంగా లేని వారిని మినహాయించి స్థానికంగా ఉండే వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే వారిలో ఇంటి స్థలం ఉన్నవాళ్లు ఎంతమంది, స్థలం లేని వాళ్లు ఎంతమందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇంటి స్థలం లేని వారికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించడంపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు కసరత్తు చేస్తున్నారు.
ఎంపీ సురేశ్ షెట్కార్ ప్రతిపాదన మేరకు
జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్ ప్రతిపాదన మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిమ్జ్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు నిర్వాసితులకు ఇండ్ల పంపిణీ విషయమై పనులు వేగంగా జరుగుతున్నాయి. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిమ్జ్ ను మంజూరు చేయగా 12,635 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. దాదాపు 3 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా రూ.31 వేల కోట్ల పెట్టుబడులతో నీమ్జ్ ను అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేసింది. కాగా గత పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం నిమ్జ్ అభివృద్ధిని అడ్డుకోగా, అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణను స్పీడప్ చేసి నీమ్జ్ పరిహారాన్ని పెంచి అర్హులైన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనుంది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.