
- ఆర్థికంగా వెనుకబడినవారికి బ్యాంకు లోన్లు రూ.50.95 కోట్లు
- కలెక్టర్ స్పెషల్ ఫోకస్తో పనుల్లో వేగం
- వారంలో జైతాపూర్ గ్రామంలో గృహ ప్రవేశాలు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఫోకస్ పెట్టి ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు బ్యాంకు లోన్లు ఇప్పించారు. ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించని వారి కోసం ఈనెల 13న మాస్ మార్కింగ్ మేళా నిర్వహించడంతో కీలక మలుపు తిరిగింది. ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించని వారంతా పనులు ప్రారంభించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో 15 గృహ ప్రవేశాలు చేసేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
స్కీమ్ సక్సెస్ దిశగా..
జిల్లాకు 19,397 ఇండ్ల మంజూరు కాగా, 17,301మంది అర్హులను గుర్తించి మంజూరు ఇచ్చారు. ఇందులో 9,486 ఇండ్ల పనులు ప్రారంభం కాగా, 4,820 ఇండ్ల బేస్మెంట్ లెవల్కు పూర్తయ్యాయి. 742 రూఫ్ లెవెల్, 237 స్లాబ్ లెవెల్, మిగతావి ఆయా దశల్లో ఉన్నాయి. నిర్మాణ దశలను బట్టి ఇప్పటి వరకు రూ.60.36 కోట్లు లబ్ధిదారులకు అందాయి. బేస్మెంట్ పూర్తైన ఇండ్లకు తొలి విడతగా రూ.లక్ష అందజేశారు. పనులు మొదలుపెట్టనివారు 4,348 మంది ఉన్నట్లు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి గుర్తించారు.
వారందరికీ బ్యాంకుల నుంచి రూ.50.95 కోట్లు లోన్లు ఇప్పించగా పనులు ప్రారంభించారు. ప్రొసీడింగ్స్ పొంది అసలు పనులు ప్రారంభించని 7,815 మందితో ఈ నెల 13న మాస్ మార్కింగ్ మేళా నిర్వహించి విలేజ్ సెక్రెటరీలు, ఆఫీసర్ల సమక్షంలో ముగ్గు పోయించారు. జైతాపూర్ గ్రామానికి మంజూరైన 74 ఇండ్లలో 15 పూర్తై గృహ ప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేస్తున్నారు.