ఇండోర్ లో బీభత్సం: పెంట్‌హౌస్ గొడవలో కారుతో తొక్కించి మహిళా టెక్కీ హత్య!

 ఇండోర్ లో బీభత్సం: పెంట్‌హౌస్ గొడవలో కారుతో తొక్కించి మహిళా టెక్కీ హత్య!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక చిన్న అద్దె వివాదం చినికి చినికి గాలివానలా మారి ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ గేటెడ్ కమ్యూనిటీలో 18 ఏళ్ల యువకుడు తన కారుతో నివాసితులపైకి దూసుకెళ్లిన భయంకరమైన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

అసలు గొడవ దేని గురించి అంటే.. ఇండోర్‌లోని శివ్ వాటికా టౌన్‌షిప్‌లో ఒక పెంట్‌హౌస్‌ను యజమానులు Airbnb ద్వారా బయటి వ్యక్తులకు అద్దెకు ఇస్తున్నారు. దీనివల్ల కాలనీలోకి గుర్తుతెలియని వ్యక్తులు వస్తున్నారని, ప్రశాంతత దెబ్బతింటోందని అక్కడి నివాసితులు కొన్నాళ్లుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి ఇదే విషయంలో నివాసితులకు, పెంట్‌హౌస్ యజమానులకు మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది.

గొడవ జరుగుతున్న సమయంలో పెంట్‌హౌస్ యజమాని కుమారుడు (18) ఆవేశంతో కారును అక్కడే ఉన్న జనంపైకి వేగంగా పోనిచ్చాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. అతను ఒకసారి కాదు, రెండుసార్లు కారును వెనక్కి ముందుకి తిప్పుతూ కావాలనే నివాసితులను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో శంపా పాఠక్ పాండే అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె రీసెంటుగా  తన కుటుంబంతో కలిసి ఈ టౌన్‌షిప్‌కు మారారు. ఈ ఘటనలో మరికొందరు నివాసితులు కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
ఈ దారుణానికి ఒడిగట్టిన యువకుడితో పాటు అతని తండ్రి కుల్దీప్‌పై కూడా పోలీసులు హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నివాస ప్రాంతాల్లో ఇలాంటి అద్దె వ్యాపారాల వల్ల భద్రతా పరమైన ఇబ్బందులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.