ఏం జరిగి ఉండొచ్చు..? అర్థమయ్యేలోపే 38 సెకన్లలోనే విమానం క్రాష్

ఏం జరిగి ఉండొచ్చు..? అర్థమయ్యేలోపే 38 సెకన్లలోనే విమానం క్రాష్

న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ 787=8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు తొలుత అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపించింది. కానీ ఆ తర్వాత కొన్ని క్షణాలకే ప్లేన్ పైకి ఎగరడంలో ఫెయిల్ అవుతోందని, ఏదో సమస్య తలెత్తిందని చూసేవాళ్లకు అనిపించింది. మరికొన్ని క్షణాలు గడిచేసరికి విమానం పైకి ఎగరకపోగా.. క్రమంగా ఎత్తును కోల్పోతూ కిందకు వెళ్తున్నట్టు కనిపించింది. విమానం ఎగరడంలో ఫెయిల్ అయిందని స్పష్టంగా అర్థమయ్యేలోపే.. మొత్తంగా టేకాఫ్ అయిన 38 సెకన్లలోనే విమానం క్రాష్​ అయి ఒక్కసారిగా పేలిపోయింది. 

ప్రమాదానికి కచ్చితమైన కారణమేంటన్నది తెలియాలంటే కొన్ని నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగిన తర్వాతే ప్లేన్ ఎందుకు కూలిపోయిందన్నది తేలుతుంది. కానీ గురువారం నాటి విమాన ప్రమాద దృశ్యాలను చూస్తే.. ప్లేన్ క్రాష్​కావడం వెనక ప్రధానంగా 4 రకాల పరిస్థితుల్లో ఏదో ఒకటి కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. టేకాఫ్​ అయిన కొన్ని క్షణాలకే తీవ్ర సమస్య తలెత్తడంతో పైలెట్లు దానిని సరిదిద్దేలోపే ఘోరం జరిగి ఉండొచ్చని చెప్తున్నారు.  

ఫస్ట్ సినారియో: ఒక ఇంజన్ ఫెయిల్, ల్యాండింగ్ గేర్లు..

విమానం రన్ వేను దాటేసి, టేకాఫ్ అయిన వెంటనే ఒక ఇంజన్ ఫెయిల్ అయి ఉండొచ్చు. లేదంటే పక్షి ఢీకొట్టి ఉండొచ్చు. సడెన్ గా తలెత్తిన సమస్యతో పైలెట్, కోపైలెట్ పై తీవ్ర ఒత్తిడి పడి ఉంటుంది. వెంటనే వాళ్లు ఇంజన్ అంశంపై ఫోకస్ పెట్టి ఉంటారు. కానీ ఇదే టైంలో పొరపాటుగా ల్యాండింగ్ గేర్లను రిట్రాక్ట్ (ఉపసంహరణ) చేయడం మరిచిపోయి ఉంటారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే డ్రాగింగ్ తగ్గిపోయి, క్లైంబ్ పర్ఫార్మెన్స్ పెరగాలంటే.. ల్యాండింగ్ గేర్లను రిట్రాక్ట్ చేయడం తప్పనిసరి. 

ఇలా సమస్యను పరిష్కరించే క్రమంలో ఒక్కో క్షణం గడుస్తున్నకొద్దీ.. విమానం సింగిల్ ఇంజన్ తో ఎగరవలసినంత కనీస స్పీడ్ తగ్గుకుంటూ పోయి, జీరోకు చేరింది. దీంతో విమానం దాదాపుగా గాలిలోనే ఆగిపోయినట్లయింది. దాదాపు 400 అడుగుల ఎత్తులో అలా స్తంభించిపోయిన విమానాన్ని రికవరీ చేయడం అనేది పైలెట్లకు దాదాపుగా అసాధ్యం అయిపోయింది. 

సెకండ్ సినారియో: ఏకకాలంలో 2 ఇంజన్లు ఫెయిల్ కావడం 

విమానం టేకాఫ్​అయిన వెంటనే 2 ఇంజన్లూ ఒకేసారి ఫెయిల్ కావడం అనేది అరుదు. కానీ తాజా ప్రమాదంలో అదే గనక జరిగి ఉంటే.. ఈ విమానం గాలిలో ఎలాంటి థ్రస్ట్ (ముందుకు తోసే ఫోర్స్) లేని ఒక గ్లైడర్(ఇంజన్లు ఉండని పొడవాటి రెక్కల విమానం)లా అయిపోయి ఉంటుంది. ఇంజన్ పవర్ లేకపోవడంతో ల్యాండింగ్ గేర్లను పైలెట్లు రిట్రాక్ట్ చేయలేకపోయి ఉంటారు. ఫలితంగా విమానంపై డ్రాగింగ్ ప్రభావం పెరిగి వేగంగా స్పీడ్​ను కోల్పోయి గాలిలో ఆగిపోయినట్లు అయి ఉంటుంది. అంత తక్కువ ఎత్తులో విమానం స్తంభించిపోవడంతో రెండు ఇంజన్లలో సమస్యలను గుర్తించి, సాల్వ్ చేసేందుకు గానీ,  ఇంజన్​ను రీస్టార్ట్ చేసేందుకు గానీ పైలెట్లకు టైం లేకపోయి ఉంటుంది.

థర్డ్ సినారియో: టేకాఫ్ ఫ్లాప్స్ రాంగ్ పొజిషన్​లో ఉండటం 

సాధారణంగా విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు దాని రెక్కలపై చివరలో ఉండే ఫ్లాప్స్ (కదిలే రేకుల వంటివి) పొజిషన్ అనేది కీలకం అవుతుంది. టేకాఫ్​అయ్యేటప్పుడు ఇవి రెక్క నుంచి ముందుకు ఎక్స్ టెండ్ అవ్వాలి. అప్పుడు రెక్క విస్తీర్ణం పెరిగి, విమానం తక్కువ స్పీడ్ లో ఉన్నా లిఫ్ట్ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాప్స్ ను తిరిగి యథాస్థానానికి రిట్రాక్ట్ చేస్తే.. విమానం క్లైంబ్ అవుతుంది. అయితే, ఈ ప్రమాద సమయంలో డ్రీమ్ లైనర్ టేకాఫ్​అవుతున్నప్పుడు ఫ్లాప్స్ రిట్రాక్ట్ అయి ఉన్నట్టుగానే వీడియోలను బట్టి తెలుస్తోంది. 

ఇంజన్ ఫెయిల్ వంటి తీవ్ర ఒత్తడితో కూడిన సమయంలో పైలట్ ఒకవేళ పొరపాటుగా ల్యాండింగ్ గేర్ ను రిట్రాక్ట్ చేయడానికి బదులుగా ఫ్లాప్స్ ను ఉపసంహరించినట్టయితే.. విమానం ఎత్తు(లిఫ్ట్)కు వెళ్లడాన్ని గణనీయంగా తగ్గించి ఉంటుంది. ప్రధానంగా ఒకే ఇంజన్ పని చేస్తున్న సమయంలో ఇలా జరిగితే విమానం దాదాపుగా స్తంభించిపోతుంది. 

ఫోర్త్ సినారియో: పనిచేస్తున్న ఒక్క ఇంజన్​నూ ఆఫ్​ చేయడం..

విమానం 400 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక ఇంజన్ ఫెయిల్ అయినట్టు గుర్తించిన పైలట్లు.. పొరపాటుగా దానికి బదులుగా పని చేస్తున్న ఇంజన్​ను షట్ డౌన్ చేసి ఉండొచ్చు. ఇలాంటి పొరపాట్లు విమానయాన చరిత్రలో అనేకం జరిగాయి. 

థ్రస్ట్​ను కోల్పోవడమే క్రాష్​కు దారి తీసింది 

కారణం ఏదైనప్పటికీ.. సడెన్​గా థ్రస్ట్​ను కోల్పోవడమే విమానం కూలిపోవడానికి దారి తీసిందని నిపుణులు చెప్తున్నారు. ఏదో ఒక కారణం వల్ల విమానం అకస్మాత్తుగా థ్రస్ట్​ను కోల్పోయి ఉంటుందని, అలాంటి క్లిష్టమైన పరిస్థితులను పైలట్లు హ్యాండిల్ చేసే క్రమంలో పొరపాట్లు జరిగి, చివరకు ప్లేన్ కూలిందని భావిస్తున్నారు.

బోయింగ్ విమానాలను తనిఖీ చేయండి

ఎయిరిండియాకు డీజీసీఏ ఆర్డర్​ 

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.  టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా (జెనెక్స్ ఇంజన్లతో నడిచేవి) బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో సెక్యూరిటీ ఇన్ స్పెక్షన్ చేపట్టాలని ఆదేశించింది. 

ఎయిరిండియా ఫ్లీట్‌లో 26 బోయింగ్ 787–-8లు, ఏడు బోయింగ్ 787-–9లు ఉన్నాయి. డీజీసీఏ ఆదేశాల ప్రకారం.. జెనెక్స్ ఇంజన్లతో కూడిన ఈ విమానాల్లో వెంటనే తనిఖీ చేపట్టాలి. ఈ తనిఖీలు కూడా సంబంధిత డీజీసీఏ ప్రాంతీయ అధికారుల సమన్వయంతో నిర్వహిస్తారు. సెక్యూరిటీ ఇన్​స్పెక్షన్ లో భాగంగా.. ఇంధన ప్రమాణాలు, సంబంధిత సిస్టమ్ చెకింగ్స్, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ టెస్ట్ , ఇంజిన్ ఇంధన ఆక్ట్యుయేటర్ ఆపరేషనల్ టెస్ట్ , ఆయిల్ సిస్టమ్ తనిఖీలు చేపడతారు.

అలాగే.. హైడ్రాలిక్ సిస్టమ్ సర్వీసబిలిటీ చెకింగ్స్, టేకాఫ్ ప్రమాణాలను కూడా సమీక్షిస్తారు. ఫ్లైట్ కంట్రోల్ తనిఖీని ట్రాన్సిట్ తనిఖీలలో చేర్చాలని, ఇంజిన్ సామర్థ్యాలకు సంబంధించిన తనిఖీలను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఎయిరిండియాకు డీజీసీఏ సూచించింది. గత 15 రోజుల్లో బోయింగ్ 787-–8/9 విమానాలలో తరచుగా సంభవించిన సమస్యలను సమీక్షించి, వీలైనంత త్వరగా నిర్వహణ చర్యలను ముగించాలని స్పష్టం చేసింది. ఈ తనిఖీల నివేదికలను సమీక్ష కోసం తమకు సమర్పించాలని డీజీసీఏ పేర్కొంది.