
మునిచ్: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ స్టేజ్–3 టోర్నీకి ఇండియా షూటర్లు రెడీ అయ్యారు. మంగళవారం నుంచి జరిగే పోటీల్లో పారిస్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ స్వప్నిల్ కుశాలే, ఎలవెనిల్ వలారివన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.డొమెస్టిక్ సర్క్యూట్లో రాణించిన కుశాలే మెన్స్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో పతకంపై దృష్టి పెట్టాడు. పారిస్ గేమ్స్ తర్వాత తొలిసారి బరిలోకి దిగుతున్న ఎలవెనిల్ కూడా సత్తా చాటాలని చూస్తోంది. ఆసియా గేమ్స్ చాంపియన్ పాలక్తో పాటు నేషనల్ చాంపియన్ అన్యన నాయుడు విమెన్స్ ఎయిర్ పిస్టల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మెన్స్ ఎయిర్ పిస్టల్లో కొత్తగా ఆదిత్య మల్రా, నిశాంత్ రావత్ బరిలోకి దిగుతున్నారు. ఓవరాల్గా 78 దేశాల నుంచి మొత్తం 695 మంది షూటర్లుఈ టోర్నీలో పాల్గొంటున్నారు. సౌత్ అమెరికాలో జరిగిన వరల్డ్ కప్లో ఇండియా 15 పతకాలు సాధించింది. కానీ మునిచ్లో వరల్డ్ బెస్ట్ షూటర్లు బరిలో ఉండటంతో పోటీ చాలా కఠినంగా ఉండనుంది. చైనా 22 మంది షూటర్లను బరిలోకి దించగా, ఆతిథ్య జర్మనీ కూడా 27 మందితో రెడీ అయ్యింది. పిస్టల్ లెజెండ్, మాజీ ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ క్రిస్టియన్ రీట్జ్పై భారీ ఆశలు ఉన్నాయి. ఫ్రాన్స్ జట్టు నుంచి జీన్ క్విక్వాంపోయిక్స్ గోల్డ్ మెడల్పై గురి పెట్టగా.. కొరియా నుంచి 19 మంది షూటర్లు ఉండగా, ఇందులో యాంగ్ జిన్, ఓమ్ యోజిన్పై ఎక్కువగా దృష్టి ఉంది.