సీఎంఆర్పై స్పెషల్ ఫోకస్.. జనగామ జిల్లాలో 80 శాతం దాటిన గత వానాకాలం టార్గెట్

సీఎంఆర్పై స్పెషల్ ఫోకస్..  జనగామ జిల్లాలో 80 శాతం దాటిన గత వానాకాలం టార్గెట్
  • యాసంగి సీజన్​కు సంబంధించి 41,433 మెట్రిక్​ టన్నులు అప్పగింత
  • రైస్​ ఎగ్గొట్టిన పలువురు మిల్లర్లకు నోటీసులు
  • రికవరీకి ఒత్తిడి చేస్తామంటున్న అధికారులు

జనగామ, వెలుగు: కస్టమ్​మిల్లింగ్​ రైస్(సీఎంఆర్)​ సేకరణపై జనగామ జిల్లా సివిల్​సప్లై ఆఫీసర్లు స్పెషల్​ఫోకస్​పెట్టారు. సకాలంలో టార్గెట్​రీచ్​ అయ్యేందుకు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్​ఆదేశాలతో మిల్లర్ల పై ఒత్తిడి పెంచుతున్నారు. పెండింగ్​ బకాయిల వసూళ్ల పైనా నజర్​పెట్టారు.  

గత యాసంగి సీజన్​లో 28 శాతం..

గత వానాకాలం సీజన్​కు సంబంధించి సీఎంఆర్​సేకరణ 80 శాతం దాటింది. జిల్లాలోని 60 రైస్ మిల్లులకు 2024–-25 సీజన్ కు సంబంధించి1,36,867 మెట్రిక్​ టన్నుల ధాన్యం కేటాయించారు. దీనికి 91,863 మెట్రిక్ టన్నుల సీఎంఆర్​రావాల్సి ఉంది. ఇప్పటివరకు మిల్లర్లు 73,683 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 18,179 మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. కాగా గడువు పెంచుతున్నా వానాకాలం సీఎంఆర్​అప్పగింత పూర్తవకపోవడంపై ఇటీవల రివ్యూ మీటింగ్​లో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఇదిలా ఉండగా యాసంగి 2024–-25 సీజన్ కు సంబంధించి జిల్లాలోని 56 మిల్లులకు 2,14,769 మెట్రిక్​ టన్నుల ధాన్యం కేటాయించారు. ఇందులో జనగామ జిల్లాకు సంబంధించి 1. 85 లక్షల మెట్రిక్​ టన్నులు కాగా మిగతాది సూర్యాపేట జిల్లాకు చెందినది. ఈ ధాన్యానికి సంబంధించి మొత్తం 1,45,045 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 41,433 మెట్రిక్​ టన్నులు సేకరించారు. 28 శాతం టార్గెట్​ రీచ్​ అవగా ఇంకా 1,03,612 మెట్రిక్​ టన్నులు సేకరించాల్సి ఉంది. 

మిల్లర్​పై క్రిమినల్​ కేసు

2022–-23 యాసంగి, 2023-–24 వానాకాలం సీజన్​కు సంబంధించి దేవరుప్పుల మండలం మన్​పహాడ్​ సాయిరాం మోడ్రన్​ బిన్నీ రైస్​ మిల్​యాజమాన్యం రూ.5.67 కోట్ల విలువైన సీఎంఆర్ ఇవ్వడం లేదు. దీంతో డబ్బులైనా చెల్లించాలని గతేడాది అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో క్రిమినల్​కేసు నమోదు చేసి, సదరు మిల్లర్ ఆస్తుల క్రయ విక్రయాలు జరపకుండా ఆదేశాలిచ్చారు.

ఇదిలా ఉంటే రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని రైస్ మిల్లు 2023–-24 యేడాదికి సంబంధించి రూ.కోటి విలువ చేసే సీఎంఆర్ ఇవ్వకపోవడంతో గతేడాది నోటీసులు ఇచ్చారు. దీని రికవరీ కూడా నేటికీ పెండింగ్​లోనే ఉంది. ఈ మొండి బకాయిలపై మరింత ఒత్తిడి పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.   

మిల్లర్లను అలర్ట్​ చేస్తున్నం

జిల్లాలో సీఎంఆర్​సేకరణ వేగవంతంగా జరుగుతోంది. కలెక్టర్ ఆదేశాలతో మిల్లర్లను ఎప్పటికప్పుడు అలర్ట్​చేస్తున్నం. గత వానాకాలం సీజన్ కు సంబంధించి80 శాతం దాటగా యాసంగి సీజన్​28 శాతం వరకు సేకరించాం. మిగతాది త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. మొండి బకాయిలు ఉన్న మిల్లర్లపై తగిన చర్యలు చేపడుతాం.​ – వి.హథీరామ్ నాయక్, డీఎం, సివిల్ సప్లై, జనగామ