జనసేనాధి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయింది. దీంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కొన్ని రోజుల నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది. పోలీసుల తరఫు నుంచి వారాహి యాత్రకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. డీఎస్పీలు ఎక్కడికక్కడ టచ్లోనే ఉంటారని.. పవన్ పర్యటనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయవచ్చని క్లారిటీ ఇచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా.. తాము కేవలం మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామని కాకినాడ జిల్లా ఎస్పీ తెలిపారు. జనసైనికులు ఎలాంటి హడావుడి చేయకుండా, సజావుగా యాత్ర జరుపుకోవాలని సూచించారు.
పోలీసు సానుకూలంగా స్పందించి, యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ తెలిపారు. జనసైనికులు హడావుడి చేయకుండా, సజావుగా సభ నిర్వహించేలా సహకరించాలని పోలీసులు కోరారు. క్రేనుల ద్వారా భారీ పూలమాల వేసే ప్రక్రియ లాంటివి లేకుండా, ప్రశాంతంగా యాత్ర చేసుకోవాలని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు. భద్రత దృష్ట్యా రాష్ట్ర, జిల్లా స్థాయి వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు( జూన్ 13) సాయంత్రం పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకుంటారని.. రేపు ( జూన్ 14) ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేసి, అన్నవరం వీరవెంకట స్వామిని దర్శించుకుంటారని స్పష్టం చేశారు. కత్తిపూడిలో మొదటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.