
కామారెడ్డి, వెలుగు : చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఎస్పీ రాజేశ్చంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న భిక్కనూరు మండల కేంద్రంలోని దత్తాద్రి బాంబు మర్చంట్ షాపు వద్ద ఒంటరిగా ఉన్న లక్ష్మికి లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి 3 తులాల బంగారు గొలుసు చోరీ చేశారన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయగా దొంగల ముఠా చిక్కిందన్నారు.
మహారాష్ర్టలోని నాందేడ్ జిల్లాకు చెందిన అఫ్తాబ్ అహ్మద్ షేక్, ఫహీమా బేగం, కబీరుద్దీన్ అబ్దుల్ రెహ్మాన్ షేక్, దీపక్ కిసాన్ సలుంకే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో 9 కేసులు నమోదయ్యాయన్నారు.
వీరి నుంచి 3 తులాల బంగారు నగలు, 2 కార్లు, బైక్, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎ1 నిందితుడు అఫ్తాబ్ అహ్మద్ షేక్పై రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో 60 కేసులు నమోదయ్యాయని, జైలుకు కూడా వెళ్లి వచ్చాడన్నారు. విడుదలైన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో భిక్కనూరు సీఐ పంపత్కుమార్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు అంజనేయులు, ఉస్మాన్ ఏఎస్సై వెంకట్రావు, సిబ్బంది దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినందుకు ఎస్పీ అభినందించారు.