
కరీంనగర్, వెలుగు: గ్రామ పాలన అధికారి(జీపీఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు కరీంనగర్ సప్తగిరి కాలనీలోని జడ్పీహెచ్ఎస్ లో ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు, గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణకు గ్రామ పాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం జిల్లాలో 189 మంది అప్లై చేసుకోగా 172 మంది పరీక్షకు హాజరయ్యారు. రాత పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, డీవైఎస్వో శ్రీనివాస్, ఏవో సుధాకర్ పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్ : గ్రామ పాలన అధికారి ఎగ్జామ్ 2025 ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో 149 అభ్యర్థులకు గానూ 142 మంది అభ్యర్థులు హాజరైనట్లు చెప్పారు. ఇంతకుముందు రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్ఏలు ఈ పరీక్ష రాయగా.. వీటిలో పాస్అయినవారిని గ్రామ పాలన ఆఫీసర్స్గా ప్రభుత్వం నియమించనుంది.