
కరీంనగర్, వెలుగు : శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. ఈఎన్టీ సర్జన్ల ఆధ్వర్యంలో కలెక్టర్కు ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కలెక్టర్ పమేలా సత్పతి కొన్నేళ్లుగా తలనొప్పి, ముక్కు దిబ్బడ, నాసిక అడ్డంకి, సైనసైటిస్తో పాటు శ్వాస ఇబ్బందితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఈఎన్టీ స్పెషలిస్ట్ను కలిసి మెడిసిన్స్ వాడుతున్నారు.
కానీ సమస్య తగ్గకపోవడంతో సర్జరీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈఎన్టీ సర్జన్లు ఎల్.రవికాంత్, సందీప్, మధుమిత ఆధ్వర్యంలో కలెక్టర్కు ఎండోస్కోపీ నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్టి సర్జరీ చేసినట్లు జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ జి.వీరారెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు సర్కార్ హాస్పిటల్స్లో ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యుల డెలివరీలు మాత్రమే జరిగాయని, మొదటిసారిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారని ఆయన తెలిపారు.