- ఖైరతాబాద్లో మట్టి గణపతి
- ఈసారి పంచముఖ మహాలక్ష్మి గణేశుడిగా దర్శనం
- కర్రపూజ నిర్వహించిన
- గణేశ్ ఉత్సవ కమిటీ
ఖైరతాబాద్, వెలుగు: ఈ ఏడాది జరగనున్న వినాయక చవితి ఉత్సవాల్లో ఖైరతాబాద్ వినాయకుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనం ఇవ్వనున్నారని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో, మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. శుక్రవారం కమిటీ ఆధ్వర్యంలో కర్ర పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి మాట్లాడారు. ఎంతో నిష్టతో నిర్వహించే గణేశ్ ఉత్సవాలు అందరు కలిసిమెలిసి నిర్వహించడం శుభసూచకం అన్నారు. వినాయక సాగర్లో నిమజ్జనం చేయొద్దని ఏ కోర్టు చెప్పలేదని, ఈ ఏడాది అక్కడే నిమజ్జనం చేసి తీరుతామని, దీనిపై ఎవరు ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు అన్నారు. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండాలని కోరారు. సనాతన భారతీయ సంస్కృతి మీద దాడి చేస్తే సహించేది లేదన్నారు.