రిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు ప్లాట్లు.. పోలేపల్లిలో 125 ఎకరాల్లో రెడీ అవుతున్న డీటీసీపీ వెంచర్

రిటైనింగ్ వాల్  భూ నిర్వాసితులకు ప్లాట్లు..  పోలేపల్లిలో 125 ఎకరాల్లో రెడీ అవుతున్న డీటీసీపీ వెంచర్
  • కొనసాగుతున్న 100 ఫీట్లరోడ్డు నిర్మాణ పనులు 
  • సాగర్​ కాల్వపై రూ.10 కోట్లతో ఫ్లై ఓవర్ కు ప్లాన్​ ​ 
  • మున్నేరుపై రిటైనింగ్ వాల్ నిర్మాణం 30 శాతం పూర్తి 
  • త్వరలోనే ప్రకాశ్​నగర్ చెక్ డ్యామ్​ తొలగించేందుకు నిర్ణయం

ఖమ్మం, వెలుగు:  మున్నేరు నదికి రెండు వైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ కోసం ప్లాట్లు, భూములు కోల్పోయిన బాధితులకు ఇండ్ల ప్లాట్లు దక్కనున్నాయి. ల్యాండ్ పూలింగ్ విధానంలో భాగంగా భూ నిర్వాసితులకు డీటీసీపీ అప్రూవుడ్ లే అవుట్ లో స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే పోలేపల్లిలోని నాగార్జున సాగర్​ ప్రాజెక్టు మిగులు భూముల్లో లే అవుట్​ సిద్ధమవుతోంది. గత కొన్నేండ్లుగా స్థానికులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న 300 ఎకరాలకు పైగా ఎన్ఎస్పీ మిగులు భూములను గుర్తించి, అక్కడ హద్దురాళ్లు నాటారు. 

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆలోచన మేరకు అందులోని 125 ఎకరాల్లో వెంచర్​ వేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం అక్కడ 100 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. కరుణగిరి ఎదురుగా ఉన్న ఫోర్త్ క్లాస్​ ఎంప్లాయీస్​ కాలనీ రోడ్డు మీదుగా రాజీవ్ స్వగృహ ముందు నుంచి గోళ్లపాడు చెక్​ డ్యామ్​ వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మించనున్నారు.

 తర్వాత ఆ రోడ్డును తీర్థాల దగ్గర ఆకేరు మీదుగా బ్రిడ్జి దగ్గర నుంచి నాగపూర్, అమరావతి హైవేకు వెళ్లేందుకు వీలుగా పొడిగించనున్నారు.​ ఇక ఇప్పటి వరకు 30 శాతం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొత్తం ఎర్త్ వర్క్​ 2,91,400 క్యూబిక్ మీటర్లు కాగా, 10,578 క్యూబిక్​ మీటర్లు కంప్లీట్ అయింది. 17,000 మీటర్ల ఎర్త్ వర్క్​ కు 4,365 మీటర్ల ఎర్త్ వర్క్​ పూర్తయింది. ఇక 6,06,765 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ వర్క్​ కు గాను1,80,770 క్యూబిక్​ మీటర్లు పూర్తయింది. 17వేల మీటర్లకు గాను 2,800 మీటర్లు పూర్తయినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.

ఎన్ఎస్పీ కాల్వపై రూ.10 కోట్లతో ఫ్లైఓవర్!

ఖమ్మం నగరానికి అతి సమీపంలో ఉన్న పోలేపల్లి దగ్గర భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న డీటీసీపీ వెంచర్​ కు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో పోలేపల్లి సాయి బాబా గుడి ఎదురుగా రాజీవ్ స్వగృహ నుంచి కాల్వ అవతలి వరకు రూ.10 కోట్లతో 300 మీటర్ల మేర ఫ్లై ఓవర్​ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రపోజల్ కు గ్రీన్​ సిగ్నల్ వచ్చిన తర్వాత 100 ఫీట్ల వెడల్పుతో డీటీసీపీ వెంచర్​ కు ప్రధాన రహదారి ఏర్పడనుంది. 

ఇక దాదాపు రూ.630 కోట్లతో నిర్మిస్తున్న మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం రెండు వైపులా మొత్తం 138 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 70 ఎకరాలకు పైగా రైతులు అనుమతించారు. రైతులు కోల్పోతున్న ప్రతీ ఎకరానికి డీటీసీపీ లే అవుట్ లో 650 గజాల చొప్పున పూర్తిగా డెవలప్​ చేసిన ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నారు. ఇక ఇంటి స్థలాన్ని కోల్పోతున్న వారికి గజానికి గజం చొప్పున ప్లాట్ ఇవ్వనున్నారు. 100 గజాల కంటే తక్కువ ప్లాట్ ను కోల్పోయిన వారికి కూడా కనీసం 100 గజాల ఇంటి చోటు ఇవ్వనున్నారు. 

50 గజాలు కోల్పోయినా 100 గజాల స్థలాన్ని ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక రిటైనింగ్ వాల్ కోసం సేకరించిన భూమిలో ఉన్న వివిధ రకాల చెట్లకు కూడా రేటు నిర్ణయించి ఇప్పటికే ప్రభుత్వానికి రూ.15 లక్షల వరకు డబ్బులు జమచేశారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాదికి రిటైనింగ్ వాల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. రిటైనింగ్ వాల్ కు రెండు వైపులా డ్రెయిన్ల నిర్మాణం కోసం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్​ నుంచి డిజైన్లకు అప్రూవల్స్​ రావాల్సి ఉంది. క్యాచ్​ మెంట్ ఏరియాల ప్రకారం ఇప్పటికే ఇరిగేషన్​ అధికారులు డ్రెయిన్లు డిజైన్​ చేసి కేంద్రానికి సబ్​మిట్ చేశారు. నీటి సాధారణ ప్రవాహానికి అడ్డంకి లేకుండా డిజైన్​ చేసి పంపించామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

ప్రకాశ్​ నగర్​ చెక్​ డ్యామ్​తొలగింపు ఖాయం!

గత రెండేండ్లుగా ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద ముంచెత్తడానికి ప్రధాన కారణమైన ప్రకాశ్​నగర్​చెక్​డ్యామ్​ను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉన్నతాధికారులు దీనిపై తుది నిర్ణయం కోసం రెండుసార్లు ఎక్స్ పర్ట్ లను పంపించారు. ఈఎన్​సీ, క్వాలిటీ కంట్రోల్ సీఈ సహా ఇంజినీరింగ్ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. మున్నేరుపై ఎక్కడా లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.8 కోట్లకు పైగా ఖర్చు చేసి 3 మీటర్ల ఎత్తులో చెక్​ డ్యామ్​ నిర్మించారు.

ఏ నదిలో కూడా 2.3 మీటర్ల కంటే ఎత్తులో చెక్​ డ్యామ్​ కట్టకూడదు.. కానీ, ఖమ్మంలో మాత్రం రూల్స్​ అతిక్రమించి చెక్​ డ్యామ్​ నిర్మించారు. చెక్​ డ్యామ్​ ఉన్న స్థలం కూడా వంపులో ఉంది. 2022లో చెక్​ డ్యామ్ నిర్మాణం​ పూర్తయిన తర్వాత వరుసగా రెండేండ్లు గత 70 ఏండ్ల చరిత్రలోనే లేని విధంగా 38 అడుగుల మేర మున్నేరుకు వరద రావడానికి చెక్​ డ్యామ్​ కారణమని తేల్చారు. వరద 28 ఫీట్ల ఎత్తులో రాగా మరో 10 ఫీట్ల మేర చెక్​ డ్యామ్​ వలన నీటి మట్టం పెరిగిందని నివేదించారు. 

అయితే చెక్​ డ్యామ్​ ను ఏ లెవల్ వరకు తీసేయాలి అనేది ఉన్నతాధికారులు నివేదిక అడిగినట్టు సమాచారం. సమీప ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్​ కోసం మూడు ఫీట్ల ఎత్తు మాత్రమే ఉంచి మిగిలిన చెక్​ డ్యామ్​ ను తొలగించనున్నట్టు తెలుస్తోంది. గత రెండుసార్లు వచ్చిన వరదల తర్వాత దాదాపు 30 కాలనీ వాసుల నుంచి చెక్​ డ్యామ్​ పైనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రకాశ్​నగర్​దగ్గర చెక్​ డ్యామ్​ ను తొలగించేందుకే నిర్ణయించారు. త్వరలోనే కంట్రోల్డ్ బ్లాస్ట్ ద్వారా చెక్​ డ్యామ్​ పేల్చివేత పనులు జరుగుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు.