
- ఉచిత బస్సు స్కీమ్తో ఆర్టీసీ దివాలా: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ బస్సుల్లో కనీస చార్జీపై రూ.10 పెంచి పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. బస్సు చార్జీల పెంపు పిడుగులాంటిదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చార్జీల పెంపుతో సగటు ప్రయాణికుడిపై నెలా నెలా అదనంగా రూ.500 భారం పడుతుందని, బడుగులు, కూలీలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.
ఇప్పటికే విద్యార్థుల బస్పాస్ చార్జీలు, టీ24 టికెట్ ధరలు పెంచింది చాలదన్నట్టు.. కనీసచార్జీపైనా 50 శాతం పెంచడం రేవంత్ అసమర్థ, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉచిత బస్సు స్కీమ్తో ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీయించిందని, ఇప్పుడు సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడడం క్షమించరానిదని మండిపడ్డారు.