- రిజర్వేషన్లు ఖరారు చేసిన మున్సిపల్ శాఖ
- ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సగం స్థానాలు బీసీలకు రిజర్వ్
మహబూబ్నగర్, వెలుగు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను స్పీడప్ చేస్తోంది. కొద్ది రోజుల కింద డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును రిలీజ్ చేయగా.. మార్పులు, చేర్పుల కోసం అవకాశం కల్పించింది. పొలిటికల్ పార్టీలతో సమావేశాలు, ఎన్నికల అధికారులతో సమీక్షలు నిర్వహించి.. ఇటీవల ఫైనల్ ఓటరు లిస్ట్ను కూడా రిలీజ్ చేసింది. ఈ క్రమంలో తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది.
ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ శనివారం రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు విడదల చేశారు. ఇందులో మొదటి సారి ఎన్నికలు జరిగే మహబూబ్నగర్ మేయర్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 20 మున్సిపాలిటీలు ఉండగా.. 10 మున్సిపాలిటీలు బీసీ జనరల్, బీసీ మహిళలకు అలాట్ చేశారు. తొమ్మిది మున్సిపాలిటీలను జనరల్, జనరల్ ఉమెన్కు కేటాయించగా.. ఒక స్థానాన్ని ఎస్టీ జనరల్కు కేటాయించారు.
మూడు స్థానాలు బీసీలకే..
మహబూబ్నగర్ మున్సిపాలిటీని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసింది. గతంలో 47 వార్డులు ఉండగా, 60 డివిజన్లతో కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసింది. అలాగే దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీగా ఉండగా.. 12 వార్డులతో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మేజర్ గ్రామ పంచాయతీని కూడా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. మొత్తం 16 వార్డులతో ఈ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే.. కొత్తగా ఏర్పాటైన ఈ మూడు స్థానాలను మున్సిపల్ శాఖ బీసీలకు రిజర్వ్ చేసింది. ఇందులో మహబూబ్నగర్ కార్పొరేషన్కు మొదటి సారి జరిగే ఎన్నికలో మహిళా నేత మేయర్ పీఠాన్ని
అధిష్టించనున్నారు.
చైర్మన్ల రిజర్వేషన్లు ఇలా..
భూత్పూర్(ఎస్టీ జనరల్), అయిజ(బీసీ జనరల్), వడ్డేపల్లి(బీసీ జనరల్), అలంపూర్(బీసీ జనరల్), నాగర్కర్నూల్(బీసీ జనరల్), మద్దూరు(బీసీ జనరల్), దేవరకద్ర(బీసీ ఉమెన్), కొల్లాపూర్(బీసీ ఉమెన్), అచ్చంపేట(బీసీ ఉమెన్), కొత్తకోట(బీసీ ఉమెన్), ఆత్మకూరు(బీసీ ఉమెన్), జడ్చర్ల(జనరల్), కోస్గి(జనరల్), మక్తల్(జనరల్), అమరచింత(జనరల్), పెబ్బేరు(జనరల్), గద్వాల(జనరల్ మహిళ), కల్వకుర్తి(జనరల్ మహిళ), నారాయణపేట(జనరల్ మహిళ), వనపర్తి(జనరల్ మహిళ)కు కేటాయించారు.
