నారాయణపేట, వెలుగు : మక్తల్, -నారాయణపేట, -కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి,- మల్రెడ్డి గ్రామాల సమీపంలో రిజర్వాయర్ నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాలమూరు రైతులు ఆగమైపోయారని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి చరిత్రలో నిలిచిపోయేలా ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. మక్తల్, -నారాయణపేట-, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
రైతుల భూములకు అధిక మొత్తంలో పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సే అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలని రాజకీయ పార్టీలకు అతీతంగా కోరుకోవడం అభినందనీయమన్నారు. రూ. 4,500 కోట్లతో ప్రాజెక్ట్ను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ మరో 20 నెలల్లో పూర్తి అయి ఇక్కడి ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రాజెక్ట్ కోసం సర్వం కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటానని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మల్రెడ్డి సర్పంచ్ శ్వేత శివకుమార్, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, నారాయణపేట మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ హెచ్టి.శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేతాన్కుమార్ పాల్గొన్నారు.

