న్యూఢిల్లీ: మారుతి సుజుకీ వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల రేట్లను పెంచుతామని ప్రకటించింది. కమోడిటీ ధరలు పెరిగాయని, ఇన్ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లోనే ఉందని వెల్లడించింది. ఖర్చులు పెరగడంతో వెహికల్స్ ధరలను పెంచాల్సి వస్తోందని వివరించింది. ఆల్టో వంటి చిన్న కార్ల నుంచి ఇన్విక్టో వంటి మల్టీ యుటిలిటీ వెహికల్స్ వరకు వివిధ మోడల్స్ను మారుతి అమ్ముతోంది.
వీటి ధరలు రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల (ఎక్స్షోరూమ్ న్యూఢిల్లీ) మధ్య ఉన్నాయి. ధరలను ఎంత మేర పెంచుతామనేది మాత్రం కంపెనీ చెప్పలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, తమ ఖర్చుల భారాన్ని కొంత మేర కస్టమర్లకు బదలాయించాలని చూస్తున్నామని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. మోడల్ను బట్టి రేట్ల పెంపు ఉంటుందని వెల్లడించింది.
రేట్లు 2 శాతం పైకి..
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి కూడా వెహికల్స్ రేట్లు పెంచుతామని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ కార్ల ధరలను 2 శాతం పెంచుతామని పేర్కొంది. ముడిసరుకుల ధరలు పెరగడం, కార్యకలాపాల ఖర్చులు ఎక్కువవ్వడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అన్ని మోడల్స్ ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి పెరుగుతాయని పేర్కొంది.
ఇండియాలో బిజినెస్ విస్తరించడానికి కార్ల రేట్లను పెంచుతున్నామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లన్ ఓ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. పెరిగిన ధరల ప్రభావం కస్టమర్లపై వీలున్నంత తక్కువ పడేలా చూస్తామని చెప్పారు. ఆడి క్యూ3 మోడల్ నుంచి ఆర్క్యూ8 మోడల్ వరకు వివిధ కార్లను అమ్ముతోంది. వీటి ధరలు రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల మధ్య ఉన్నాయి.