నిజామాబాద్ జిల్లాలో సన్నాల సాగుకు సన్నద్ధం .. 33 రకాల నోటిఫైడ్​ సీడ్​పై ప్రచారం

నిజామాబాద్ జిల్లాలో సన్నాల సాగుకు సన్నద్ధం .. 33 రకాల నోటిఫైడ్​ సీడ్​పై ప్రచారం
  •  అగ్రికల్చర్​ ఆఫీసర్లకు కలెక్టర్​ ఆదేశాలు
  •  రేషన్​కార్డులకు సన్నబియ్యం కొరత రాకుండా ముందస్తు చర్యలు

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఖరీఫ్​ సీజన్​ పనులు రెండు వారాల్లో షురూ కానుండగా.. అధికారులు సన్నరకం వరిసాగుకు ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ సారి మొత్తం 5.62 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనాలు రూపొందించగా అందులో 4.37 లక్షల ఎకరాలు వరి సాగవుతుందని భావిస్తున్నారు.  వరి సాగులో సన్నరకమే పూర్తిగా ఉండేలా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లాన్ రెడీ చేశారు.  

రేషన్​ కార్డులున్న పేదలకు సర్కార్​ సన్నబియ్యం అందిస్తున్నందు వల్ల ఆ రైస్​ పంపిణీకి మున్ముందు ఎక్కడా కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు.  గత ఖరీఫ్​లో ఎంఎస్​పీకి  తోడు  గవర్నమెంట్​ రూ.500 బోనస్​ రైతులకు ఇచ్చింది.  యాసంగిలో కూడా సన్నవడ్లకు ఇస్తామని ప్రకటించగా ఆఫీసర్లు బిల్స్​తయారు చేసి పంపారు.  వచ్చే ఖరీఫ్​ సీజన్​కు సంబంధించి బోనస్​ విషయంలో ఎలాంటి ప్రకటన వెలువడలేదు.  కాగా సన్నరకం వరి సాగు వైపే  అన్నదాతలను ప్రోత్సాహించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. 

సర్​ప్లస్ ఉన్నప్పటికీ అలర్ట్​గా..​ 

జిల్లాలో 4,02,217 రేషన్​కార్డులుండగా ప్రతినెలా 8,248 మెట్రిక్​ టన్నుల బియ్యం 13,14,456 మందికి అందిస్తున్నారు. మరో పక్క కొత్త కార్డులు శాంక్షన్​ చేసే కసరత్తు నడుస్తుంది. దీంతో మున్ముందు నెలవారీ  రైస్​ కోటా కూడా గణనీయంగా పెరుగనుంది. ఏప్రిల్​ నుంచి రేషన్​కార్డులున్న పేదలందరికీ గవర్నమెంట్​ సన్నబియ్యం అందిస్తోంది.  దీంతో  రేషన్​షాప్ ల్లో పది రోజుల్లోపే సన్నబియ్యం తెచ్చుకుంటున్నారు.  యాసంగిలో గవర్నమెంట్​ 7.92 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు రైతుల నుంచి కొనుగోలు చేయగా అందులో సన్నాలు 7.20 లక్షల టన్నులు ఉన్నాయి.  

ఎనిమిది నెలలకు సరిపడా.. 

బఫర్​ స్టాక్​ కలిపితే ప్రస్తుతం ఇందూర్​ జిల్లాలో మరో ఎనిమిది  నెలలకు సరిపడ సన్న బియ్యం నిల్వలు ఉండగా రంగారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, మెదక్​జిల్లాల అవసరాలకు ఇక్కడి బియ్యంను సివిల్​సప్లయి ఆఫీసర్లు పంపుతున్నారు. మున్ముందు పంపిణీ  చేసే సన్న బియ్యంకు కొరత రాకుండా  సన్నరకం వరిసాగు వైపు రైతులను రెడీ చేసే సంకల్పంతో అధికార యంత్రాంగం ప్లాన్ రెడీ చేసింది.  మార్కెట్​ డిమాండ్​ కూడా పరిగణలోకి తీసుకొని సన్నాలనే సాగు చేయించేందుకు ప్రిపేర్​ అయ్యారు. 

 ఏఈవోలపై బాధ్యత

నోటిఫై చేసిన 33 రకాల సన్నరకం వడ్లకు 2024-– 25 ఖరీఫ్​లో రూ.120 కోట్లను బోనస్​ రూపంలో గవర్నమెంట్​ జిల్లా  రైతులకు చెల్లించింది.  ప్రస్తుత యాసంగిలో రూ.1,840 కోట్ల విలువ వడ్లను ఇప్పటికే కొనుగోలు చేసిన సర్కార్​ రూ.500 చొప్పున బోనస్​ పేమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  ఏర్పాట్లు చేస్తోంది. బోనస్​ కారణంగా రెండు సీజన్లలో జిల్లాలో సన్నరకం వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాగా 2025-–26 ఖరీఫ్​ సీజన్​కు బోనస్​ ఇవ్వడంపై పాలకుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 

అయినప్పటికీ రైతులు సన్నాల వైపే ఆసక్తి చూపించేలా చేయాలని కలెక్టర్​ నిర్ణయించారు. 33 రకాల నోటిఫైడ్ సీడ్​ రైతులకు అందుబాటులో పెట్టి నారుమడి వేయించడానికి ఏఈవోల ద్వారా ఏర్పాట్లు చేశారు.  రైతు వేదికలు ఉపయోగించుకొని విస్తృత ప్రచారం చేయనున్నారు. జిల్లాలో ఇతర డివిజన్​ల కంటే వరినాట్లు ముందుగా వేసే  బోధన్​ డివిజన్​లో ఈ రకంగా నారు పోయించారు.