
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి సుడా కమర్షియల్ కాంప్లెక్స్, ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.4 కోట్లతో సుడా వాణిజ్య భవనం, ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను రూ.79 లక్షలతో చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సిటీలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
కరీంనగర్ శాతవాహన యునివర్సిటీ గతంలో తాము ఏర్పాటు చేసిన గ్రూపులతోనే రన్ అయిందని, మళ్లీ తమ ప్రభుత్వం వచ్చాక యూనివర్శిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, మృత్యుంజయం, జిల్లా అధికారులు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
మంథని, వెలుగు: రైతుల సంక్షేమం కోసమే సహకార బ్యాంకులు పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంథని, కమాన్ పూర్ మండలాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమాన్పూర్ మండలంలో రూ.65 లక్షలతో నిర్మించిన ప్యాక్స్ కొత్త బిల్డింగ్, 79 లక్షలతో నిర్మించిన డీసీసీ బ్రాంచ్ బిల్డింగ్ను ప్రారంభించారు.
మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో రూ. 7 కోట్లతో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న గోదాంలను ప్రారంభించారు. గుంజపడుగు శివారులో పీఎం కుసుమ్ కింద 3.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న మెగావాట్ సోలార్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, లీడర్లు పాల్గొన్నారు.