
కూసుమంచి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కూసుమంచి లోక్యాతండా రోడ్డులో ఆదివారం ఓ రైతు చేలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సదంర్భంగా అరక పట్టి పొలం దున్నడంతో పాటు పత్తి విత్తనాలు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది వానలు బాగా పడి, పాడి పంటల ఎగుమతిలో తెలంగాణ నంబర్ వన్గా నిలవాలని ఆకాంక్షించారు.
అనంతరం తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని మూడు సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. అంబేద్కర్ రాసిన అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, రాజారం, సోలీపురం, కాకరవాయి గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.