
- మంత్రి పొన్నం ప్రభాకర్
- ఇందిరమ్మ ఇల్లు వచ్చినా కట్టుకోని వాళ్ల ప్లేస్లో తర్వాతి వాళ్లకు అవకాశమిస్తామని వెల్లడి
- పదేళ్లుగా రాని రేషన్ కార్డులు ఇస్తున్నామని వెల్లడి
హుజురాబాద్(సైదాపూర్), వెలుగు: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఆగస్టు 1వరకు ముగ్గు పోసి ప్రారంభించకపోతే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపీడీవో ఆఫీసులో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పదేళ్లుగా ప్రజలు రేషన్ కార్డులు, ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, బస్సుల ఓనర్లను చేశామన్నారు. గ్రామాలకు ప్రైవేట్ స్కూల్ బస్సు రాకుండా చేసి, పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకు పంపిస్తే ఆ ఊరికి 5 మంచి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ తానాజీ, ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్ పాల్గొన్నారు.