
- మంత్రి వాకిటి శ్రీహరి
సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి విజయ డెయిరీ పాల సేకరణలో రాష్ట్రంలో నంబర్ వన్గా నిలవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా విజయ డెయిరీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, పాల పదార్థాల తయారీ విధానాన్ని, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం డెయిరీ ప్రాంగణంలో మొక్కలు నాటి మాట్లాడారు. గ్రామాల వారీగా పాడి రైతులకు పాల ఉత్పత్తిపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి 15 రోజులకు పాల డబ్బులు అందజేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
డెయిరీ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి నూతన భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విజయ డెయిరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి, డెయిరీ జిల్లా జీఎం మధుసూదన్, డీడీ నాగేశ్వర్ రావు, క్వాలిటీ కంట్రోల్ అధికారి కవిత, ధనరాజ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతకుంట తిరుపతి రెడ్డి, ఎర్రపహాడ్ బీఎంసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కంకల్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఇవ్వని హామీలు అమలు చేస్తున్నాం
ఆర్మూర్ : ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు, మేనిఫెస్టోలో లేని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఆర్మూర్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 15న జరగాల్సిన బీసీ డిక్లరేషన్ సభ వాయిదా వేసినట్లు చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లారెడ్డి రాంరెడ్డిలను కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఘనంగా సత్కరించారు.
డెయిరీ కాలేజీలో ఎంటెక్ కోర్సుల ఏర్పాటుకు కృషి
కామారెడ్డి, వెలుగు: తెలంగాణలో ఏకైక డెయిరీ కాలేజీలో ఎంటెక్ కోర్సులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శుక్రవారం కామారెడ్డి డెయిరీ కాలేజీ పాటు, పాతరాజంపేట శివారులోని డెయిరీని విజయ డెయిరీని మంత్రి పరిశీలించి మాట్లాడారు.
కాలేజీకి ప్రహరీ, ఇతర మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. విజయ డెయిరీ భవనం స్థలం సరిహద్దుల సమస్యపై వెంటనే కలెక్టర్తో ఫోన్లో చర్చించారు. కాలేజీ డీన్ డాక్టర్ సురేష్, ప్రొఫెసర్లు ఉమాపతి, స్వర్ణలత, విజయ డెయిరీ డీడీ నాగేశ్వర్రావు, జీఎం మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.