మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును వన్టౌన్ పోలీసులు 24 గంటల్లోనే చేధించి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. కేసు వివరాలను బుధవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వెల్లడించారు.
ఈ నెల 27న మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాటరింగ్ హోటల్ బజార్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన జాజం గోపీచంద్ అనే వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ నాగభూషణరావు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగను పట్టుకున్నారు.అతని నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు, ఒక బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించి నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ రాజశేఖర్ రాజు అభినందించారు.

