వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలన, ఇప్పుడున్న ప్రజాప్రభుత్వ రెండేండ్ల పాలనలో వర్ధన్నపేటకు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే కేఆర్నాగరాజు సవాల్ విసిరారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో హనుమకొండ, హసన్ పర్తి మండల పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 132 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 34లక్షల 15వేల 544 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వర్ధన్నపేటను భ్రష్టు పట్టించారని, వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం తగదని హెచ్చరించారు..
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఫ్రస్టేషన్ లో స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేను వర్ధన్నపేట మున్సిపల్ కొత్త పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. మున్సిపల్ చైర్పర్సన్పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్పర్సన్ నేతావత్ శిబారాణి రాజేందర్, కౌన్సిలర్లు, ఇతర నాయకులు ఎమ్మెల్యేను కలిసి బొకే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమోరిగూడెనికి చెందిన మహమ్మద్ సోని - గుళ్లు దంపతులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో వారి గృహప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్జిల్లా వర్ధన్నపేట ఇల్లందలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి, నిర్మాణాలను ప్రారంభించారు.
