
హైదరాబాద్, వెలుగు: ఇమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా నిర్వహించే మొహర్రం సంతాప దినాలు శనివారంతో ముగిశాయి. మొహర్రం సందర్భంగా షియాలు మాతమ్ నిర్వహించారు. నల్ల దుస్తులు వేసుకుని ఇమామ్ హుస్సేన్ ఆలం ముందు రక్తం చిందించారు. పాతబస్తీలోని డబీర్పురా బీబీ కా ఆలావా, సికింద్రాబాద్లోని ఆలావాల వద్ద భారీ సంఖ్యలో షియాలు పాల్గొన్నారు. డబీర్పురా ఆలావా నుంచి బీబీ ఫాతిమా, ఇమామ్హుస్సేన్ ఆలాంలను ఏనుగుపై ఊరేగించారు. ఓల్డ్సిటీలో ఏర్పాటు చేసిన అన్ని ఆలావాల నుంచి షియాలు బీబీ కా ఆలావాకు వచ్చారు. గుల్జార్హౌస్, చార్మినార్, మదీనా, సాలాజ్జంగ్ మ్యూజియం మీదుగా రాత్రి చాదర్ఘాట్ కర్బాల మైదాన్ వరకు జరిగిన మాతమ్లో పాల్గొన్నారు. హుస్సేన్ విషాద గీతాలను ఆలపిస్తూ షియాలు తమ రక్తంతో సంతాపాన్ని తెలిపారు. బ్లేడ్లు, కత్తులతో తల,ఛాతి భాగాల్లో కట్ చేసుకుని నివాళులు అర్పించారు. మాతమ్లో పాల్గొన్న వారికి నిర్వాహకులు షర్బత్, తాగునీరు, గ్లూకోజ్ అందించారు. అన్నదానాలు చేశారు. సికింద్రాబాద్ కర్బాల మైదాన్లో జరిగిన మాతమ్లో ఆయా ఏరియాల్లోని అలావాల నుంచి షియాలు పాల్గొన్నారు. సిటీ సీపీ ఆనంద్ చార్మినార్ వద్ద బీబీ కా ఆలంకు దట్టి సమర్పించారు.
వెయ్యి మందితో బందోబస్తు
ఊరేగింపులో ఎలాంటి ఘటనలు జరగకుండా వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ ఏర్పాట్లను సిటీ సీపీ ఆనంద్ పర్యవేక్షించారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. రోప్ పార్టీ పోలీసులతో ర్యాలీని మానిటరింగ్ చేశారు. ఊరేగింపునకు అనుగుణంగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు.