50 కేజీల గాంజా పట్టివేత ఒడిశాకు చెందిన ఇద్దరు అరెస్ట్
ఖమ్మం టౌన్,వెలుగు : రైలులో గంజాయిని తరలిస్తూ ఖమ్మం జిల్లా పోలీసులకు ఇద్దరు పట్టుబడ్డారు. ఆదివారం మీడియా సమావేశంలో వన్ టౌన్ సీఐ కరుణాకర్ వివరాలు తెలిపారు. ఒడిశాలోని సందీప్ బుయా వద్ద 50 కేజీల గంజాయిని ఒడిశాకు చెందిన పుష్కర్ పచ్చ, సంతోష్ సైకా తక్కువ ధరకు కొన్నారు. మహారాష్ట్రలోని పుణెలో ఉండే అతుల్ సదాశివ్ అవాద్ కు ఎక్కువ ధరకు అమ్మేందుకు రైలులో తీసుకెళ్తున్నారు. ఆదివారం పలాస వద్ద కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో బోగీలు తనిఖీలు చేస్తున్నారని తెలియడంతో ఖమ్మంలో దిగారు. రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వెనకాల రెండు సూపర్ బ్యాగ్ లతో పుష్కర్ పచ్చ, సంతోష్ సైకా అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. 25 చిన్న బ్యాగుల్లో 50.137 కేజీల గంజాయి దొరకగా.. విలువ 25. 06 లక్షలు ఉంటుంది. పుష్కర్ పచ్చ, సంతోష్ సైకాతో పాటుగా సంజీత్ కుమార్, అతుల్ సదాశివ్ అవాద్ లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పట్టుబడిన ఇద్దరిని కోర్టులో రిమాండ్ చేసినట్టు చెప్పారు. ఎస్ఐ మౌలానా, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
బీదర్ నుంచి ఎండు గంజాయి తెస్తూ..
మునిపల్లి : బీదర్ నుంచి హైదరాబాద్ కు ఎండు గంజాయిని తీసుకొస్తుండగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపిన మేరకు.. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా.. స్కూటిపై అనుమానాస్పదంగా వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా115 గ్రాముల ఎండు గంజాయి లభించింది. హైదరాబాద్ లోని చింతల్ కు చెందిన దేవరకొండ నాని, పల్లి సాయి పవన్ ని అదుపులోకి తీసుకుని విచారించారు. బీదర్ లో తక్కువ ధర కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఎండు గంజాయితో పాటు స్కూటి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.
తెల్లాపూర్ లో 42 కిలోల గాంజా పట్టివేత
ముగ్గురు నిందితులు అరెస్ట్
రామచంద్రాపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో సోమవారం పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 42 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తెల్లాపూర్మున్సిపాలిటీ పరిధిలోని ఓ నిర్మాణ సంస్థ లేబర్క్యాంపులో గంజాయి దాచి ఉంచారనే సమాచారం అందింది. మాదాపూర్ఎస్ఓటీ, కొల్లూరుపోలీసులు జాయింట్ఆపరేషన్ద్వారా దాడి చేశారు. స్మగ్లర్లు బెంగాల్కు చెందిన మిథున్ బర్మా, సుడెన్రాయ్, షేక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమబెంగాల్ నుంచి భారీగా ఎండు గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 21 లక్షలు ఉంటుంది. ప్రధాన నిందితుడు బిస్వా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని, పట్టుబడిన నిందితులను మాదాపూర్ స్టేషన్ కు తరలించారు. కొల్లూరుపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
