నల్గొండ, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని నల్గొండ నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నూతన కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బి.చంద్రశేఖర్కు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు, డీఈఓ భిక్షపతి, డీసీసీ బ్యాంక్ సీఈఓ శంకర్ నాయక్, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్, నల్గొండ తహసీల్దార్ పరశురాం, జిల్లా మేనేజర్ దుర్గారావు, కలెక్టర్ కార్యాలయ విభాగాల అధిపతులు, జిల్లా కలెక్టర్ సీసీలు ప్రసాద్, కరుణాకర్ రెడ్డి, పలువురు మీడియా ప్రతినిధులు పూల మొక్కలు, పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
