నకిరేకల్, ( వెలుగు): కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ వల్లే కాదు.. ఆయన తాత వల్ల కూడా కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్పాదయాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. దేశంలో కేసీఆర్ లాంటివాళ్లు చాలామంది వచ్చి పోయారని, కాంగ్రెస్ మాత్రం 120 ఏండ్లుగా ప్రజల మధ్య పటిష్టంగా ఉందన్నారు. అధికారంతో విర్రవీగుతున్న కేసీఆర్ పాలనను ప్రజలు బంగాళాఖాతంలో వేసి తొక్కేస్తారని హెచ్చరించారు.
వచ్చే నాలుగు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజారాజ్యం రాబోతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాలను, ఓటర్ల నమ్మకాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేసీఆర్కు అమ్మేశారని విమర్శించారు. అధికారం కోసం పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన గుత్తా సుఖేందర్రెడ్డికి తన పాదయాత్రపై విమర్శలు చేసే హక్కు లేదన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఎందుకోసం చేస్తున్నారు.. ప్యాలెస్ లాంటి ఫామ్ హౌస్ లు కట్టుకున్నందుకా.. వేల కోట్లు సంపాదించుకున్నందుకా అని ప్రశ్నించారు.