- నకిలీ పట్టాలు, తప్పుడు రికార్డులు,
- అధికారుల పాత్రపై సీఐడీ విచారణకు ఆదేశం
- ప్రైవేట్ కంపెనీ ఇట్టినా ప్రాపర్టీస్కు ఎదురుదెబ్బ
- 1978లో రాజేంద్రనగర్ తహసీల్ ఏర్పడగా..
- 1972, 1973లోనే పట్టాలు పత్రాలు చూసి జడ్జి విస్మయం
- రూ.5 లక్షల జరిమానా విధిస్తూ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పరిధిలోని ఖానామెట్లో సర్వే నెం.14/12, 14/13, 14/14లో ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానివేనంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై హక్కులు కోరుతూ ప్రైవేటు కంపెనీ ఇట్టినా ప్రాపర్టీస్ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం కొట్టివేసింది.
అంతేగాకుండా నకిలీ పత్రాల సృష్టి, తప్పుడు రికార్డులు, ఇందులో అధికారుల పాత్రపై సీఐడీతో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. అదనపు కమిషనర్ హోదాలోని ఐపీఎస్ అధికారితో సిట్ను ఏర్పాటు చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖాన్మెట్లో సర్వే నెం.41/12, 13, 14లో 15 ఎకరాలను 2006లో కొనుగోలు చేయగా.. 2016లో టీజీఐఐసీ ఖాళీ చేయాలంటూ నోటీసు ఇవ్వడాన్ని ఇట్టినా ప్రాపర్టీస్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దశాబ్దంనాటి కేసుపై విచారించిన జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం తీర్పు వెలువరించారు.
మోసం అన్ని చర్యలనూ నిర్వీర్యం చేస్తుందని, మోసం ద్వారా పొందిన హక్కులకు ఏ చట్టం, రాజ్యాంగం, పరిమితుల నుంచి రక్షణ లభించదని పేర్కొన్నారు. నకిలీ పత్రాలతో హక్కులను పొందిన వారి నుంచి భూములను కొనుగోలు చేసినంత మాత్రాన ఎలాంటి హక్కులు లభించవని, వారి నుంచి కొనుగోలు చేసిన వారికీ హక్కులుండవన్నారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం 1978లో ఏర్పాటైతే.. అదే కార్యాలయం నుంచి 1972, 1973లో పట్టాలు జారీ చేసినట్టు పత్రాలు సమర్పించి, హక్కులు పొందాలన్న ప్రయత్నాలను కోర్టు అనుమతించదని తేల్చి చెప్పారు.
- ఆర్వోఆర్ ప్రొసీడింగ్స్పై జడ్జి ఆశ్చర్యం
1993లో జారీ అయిన ఆర్వోఆర్ ప్రొసీడింగ్స్ తీరుపై జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్వోఆర్ చట్టం ప్రకారం ప్రొసీడింగ్స్ను తహసీల్దార్ జారీ చేయాల్సిఉందని, ప్రస్తుత కేసులో ‘రికార్డింగ్ ఆఫీసర్’ యూడీఐఆర్ శేరిలింగంపల్లి మండలం పేరుతో జారీ అయ్యాయని, ఇవి ఏ చట్టం కింద జారీ అయ్యాయో కూడా తెలియదన్నారు.
ప్రొసీడింగ్స్ జారీ చేసిన అధికారి పేరు పి.నరసింహారావు అని ఉందని, అయితే అక్కడ ఏ సమయంలోనూ ఆయన పనిచేసినట్టు రికార్డుల్లేవని, దీన్నిబట్టి ఈ పట్టాలు, ఆర్ఓఆర్ ప్రొసీడింగ్స్ నకిలీవని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. కొనుగోలు చేశామని పిటిషనర్లు చెబుతున్నప్పటికీ వారు కొనుగోలు చేసినవారికి చట్టపరమైన యాజమాన్య హక్కులు లేకపోవడం వల్ల ఆ వాదన చెల్లుబాటుకాదని, అసైన్డ్ భూముల కొనుగోలు చెల్లదని చెప్పారు.
రెవెన్యూ అధికారుల ప్రకారం ఈ సర్వే నంబర్లలో మాజీ సైనికుల కోటా కింద కేటాయింపులు చేయలేదని, వారు సమర్పించిన పట్టా పత్రాలే నకిలీవంటూ ఆధారాలతో సమర్పించారన్నారు.
- ఆ బాధ్యత పిటిషనర్లదే..
ఈ భూములపై హక్కులను ఆధారాలతో నిరూపించుకోవాల్సిన బాధ్యత పిటిషనర్లదేనని జడ్జి పేర్కొన్నారు.. ఇదే సర్వే నంబర్లో కొంత భూమిని పేదలకు ఇవ్వగా.. 75 ఎకరాలను టీజీఐఐసీకి 1997లో, 105 ఎకరాలను హెచ్ఎండీఏకు అప్పటి మార్కెట్ విలువ ప్రకారం రూ.12 కోట్లకు ప్రభుత్వ కేటాయించిందన్నారు.
మూడు నకిలీ పట్టా, మ్యుటేషన్ సర్టిఫికెట్ల ద్వారా చేసే క్లయిమ్స్ను కోర్టు అనుమతించదని స్పష్టం చేశారు. కల్పిత పత్రాలు సృష్టించారన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారని మండిపడ్డారు. నకిలీ పట్టాలతోపాటు మ్యుటేషన్లను సృష్టించడం, ఇందులో అధికారుల పాత్రపై సీఐడీ దర్యాప్తును 4 వారాల్లో పూర్తి చేసి.. నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పిటిషన్ను కొట్టివేస్తూ రూ. 5 లక్షల జరిమానాను ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని పిటిషనర్ ఇట్టినా ప్రాపర్టీస్ను ఆదేశించారు.
