పత్తి రైతుల చూపు.. ప్యాకెట్ విత్తనాల వైపు... దిగుబడి, పెట్టుబడి చేతికి రాక తీవ్ర నష్టాలు

పత్తి రైతుల చూపు.. ప్యాకెట్ విత్తనాల వైపు... దిగుబడి, పెట్టుబడి చేతికి రాక తీవ్ర నష్టాలు
  • గతంలో లూజ్​విత్తనాలు వేయడంతో దెబ్బతిన్న పంటలు
  •      ఆరేండ్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తరించిన లూజ్​పత్తి విత్తనాల మాఫియా
  •      ఈసారి అగ్రికల్చర్, పోలీస్​ డిపార్ట్​మెంట్ల​ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా 

మహబూబ్​నగర్​, వెలుగు :  పత్తి పంటకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి మహబూబ్​నగర్​  జిల్లాలో ఈసారి పత్తి రైతుల చూపు అంతా ప్యాకెట్​ విత్తనాల పైనే ఉంది. ఈ సీజన్​లో కూడా ఉమ్మడి జిల్లాలో లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో ఏటా సర్టిఫైడ్​ చేయని విత్తనాలు మార్కెట్​లో చలామణి అవుతున్నాయి. దాంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న పత్తి రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్​లో అగ్గువకు దొరికే లూజ్​ విత్తనాలు, జర్మినేషన్​లో ఫెయిల్​ అయిన విత్తనాలను కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫై చేసిన ఆయా సీడ్​ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. 

ఆరేండ్లుగా ఆగం చేస్తున్న ‘లూజ్’ మాఫియా

గతేడాది ఉమ్మడి జిల్లాలో 6.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయ్యింది. అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లాలో 2,86,471 ఎకరాల్లో, నారాయణపేటలో 1,60,416, గద్వాలలో 1,55,641, మహబూబ్​నగర్​లో 80,534, వనపర్తి జిల్లాలో 2,200 ఎకరాల్లో పత్తి పంటలు సాగయ్యాయి. ఆరేండ్లుగా ఉమ్మడి జిల్లాలో కొందరు పత్తి విత్తన మాఫియా అవతారం ఎత్తారు. బడా లీడర్ల అండతో మండల స్థాయి లీడర్లు ఈ దందాకు తెరలేపారు. సీజన్​ ప్రారంభానికి ముందే ఏపీ, కర్నాటక ప్రాంతాల నుంచి లూజ్​ విత్తనాలు, జెర్మినేషన్​ ఫెయిల్​ అయిన విత్తనాలను తెప్పించుకుంటున్నారు. వాటికి లేబుళ్ల అతికించి బహిరంగ మార్కెట్లలో అమ్ముతున్నారు. ఇందు కోసం చైన్​ నెట్​ వర్క్​ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో అగ్గువకే పత్తి విత్తనాలు దొరుకుతున్నాయని ప్రచారం చేయడం, దిగుబడి బాగా వస్తుందని రైతులను నమ్మించడం చేస్తున్నారు. తీరా ఈ విత్తనాలను కొని విత్తుకుంటున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కలు ఏపుగా పెరిగినా, కాయలు పట్టడం లేదు. 

సీజన్​ ముగిసే వరకు ఒక్కో పత్తి మొక్కకు 40 నుంచి 50 కాయలు రావాల్సి ఉండగా, ఈ విత్తనాలు వేసిన చేన్లలో పది కాయలకు మించి రావడం లేదు. ఎకరాకు ఐదారు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. దీనికితోడు గత రెండు సీజన్​లలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలకు  ఈ విత్తనాలు విత్తుకున్న చేలకు తెగుళ్లు సోకి పూర్తిగా దెబ్బతినడంతో రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న రైతులు ఈసారి పత్తి విత్తనాల ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. కర్నాటక, ఏపీ నుంచి వస్తున్న లూజ్, జర్మినేషన్​లో ఫెయిల్​ అయిన విత్తనాలను కాకుండా, ప్రభుత్వం సర్టిఫై చేసిన విత్తనాలను కొని, విత్తుకుంటున్నారు. 

మాఫియాపై ఆఫీసర్ల స్పెషల్​ ఫోకస్.. 

వానాకాలం సీజన్​ ప్రారంభానికి ముందు ఏటా మార్చి, ఏప్రిల్​ నెలల్లో అగ్రికల్చర్​, పోలీస్​ డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో లూజ్, జర్మినేషన్​ ఫెయిల్​ అయిన విత్తనాలను మార్కెట్​లోకి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు టాస్క్​  ఫోర్స్​ టీమ్​లను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఈ బృందాలు దందా చేస్తున్న ముగ్గురిని మహబూబ్​నగర్​ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పీడీ కేసులు నమోదు చేశారు. అనంతరం వీరిని విచారించగా దాదాపు 55 మందితో కూడిన డీలర్లు, వ్యాపారులు, మధ్యవర్తుల చైన్​ లింకును ట్రేస్​ చేశారు. వీరందరిని పోలీసులు స్టేషన్​లకు పిలిపించి, ఈ విత్తన దందాలో మళ్లీ ప్రారంభిస్తే పీడీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనికితోడు వీరందరిపై ఈ సీజన్​లో నిఘా పెట్టారు. 

లూజ్​ విత్తనాలను అరికట్టాం

మహబూబ్​నగర్​ జిల్లాలో లూజ్​ విత్తనాలను దాదాపు అరికట్టాం. వన్, టు పర్సంట్​ అక్కడక్కడా కొంత చలామణిలో ఉన్నట్లు సమాచారం ఉంది. దానిపై కూడా నిఘా పెడతాం.  గతంలో ఈ దందా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్​ కింద కేసులు నమోదు చేసి, నిఘా పెట్టాం. వారి నుంచి చైన్​ లింక్​ను ట్రేస్​ చేసి, ఈసారి లూజ్​ విత్తనాలు మార్కెట్​లోకి రాకుండా అడ్డుకట్ట వేశాం. 

-వెంకటేశ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, మహబూబ్​నగర్​