
- రాజా రఘువంశీ పరిస్థితి రాలేదంటూ వరుడి సంతోషం
- యూపీలోని బుడాన్లో ఘటన
బుడాన్: వివాహం జరిగిన నెల రోజులకు నవ వధువు తన ప్రేమికుడితో పారిపోయింది. వధువు ఇలా చేయడంపై ఆమె భర్త ఆశ్చర్యకరంగా స్పందించాడు. ఆమెకు ధన్యావాదాలు తెలిపాడు. ఇటీవల హత్యకు గురైన రాజా రఘువంశీ పరిస్థితి తనకు ఎదురు కాలేదని సంతోషం వ్యక్తం చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ యువతి(20), సునీల్(23)ను మే 17న పెళ్లి చేసుకుంది. అత్తింట్లో తొమ్మిది రోజులు ఉన్న తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లింది. అక్కడి నుంచి ప్రియుడితో పారిపోయింది. దీంతో ఆమె భర్త తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నవ వధువు ప్రియుడితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చింది.
తాను ప్రేమికుడితో కలిసి జీవిస్తానని అధికారులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాల మధ్య సంధి కుదిర్చారు. వరుడు, వధువు విడిపోవడానికి ఇరు కుటుంబాలకు అవకాశం కల్పించారు. దీంతో యువతి ప్రేమికుడితో కలిసి వెళ్లిపోయింది. పెళ్లి సందర్భంగా బహుమతిగా ఇచ్చిన వస్తువులను వధువు కుటుంబం తిరిగిచ్చేసింది. ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడాడు. ‘‘నేను హనీమూన్ కోసం ఆమెను నైనిటాల్ తీసుకెళ్లాలని అనుకున్నాను. కానీ, ఆమె తన ప్రేమికుడితో కలిసి జీవించాలనుకుంది. అందుకు నేను సంతోషంగా ఉన్నాను. కనీసం రాజా రఘువంశీ పరిస్థితి నాకు రానందుకు ఆనందంగా ఉంది. ఆమెకు ప్రేమ దొరికింది. నా జీవితం కూడా నాశనం కాలేదు” అని పేర్కొన్నాడు.