నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని పలు నామినేషన్ సెంటర్లను శుక్రవారం పలు సెంటర్లను కలెక్టర్ఇలా త్రిపాఠి పరిశీలించారు. నగరంలోని బడా బజార్ వాటర్ ట్యాంక్ మున్సిపల్ జోన్ ఆఫీస్ విజిట్ చేసి, నామినేషన్ల పత్రాల స్వీకరణపై ఆరా తీశారు. సాయంత్రం 5 గంటల్లోపు సెంటర్లలోకి వచ్చిన వారి నామినేషన్లు మాత్రమే తీసుకోవాలని, తరువాత గేట్లు క్లోజ్ చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు సపోర్టింగ్ స్టాఫ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా లేదా అని చూశారు. పొరపాట్లకు తావు ఇవ్వొద్దన్నారు. నామినేషన్లు సమర్పించిన వారి వివరాలను పక్కాగా రిజిస్టర్ లో నమోదు చేయాలని, అఫిడవిట్లను నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని, సకాలంలో రిపోర్టులు పంపించాలన్నారు. ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఉన్నారు.
బోధన్లో..
బోధన్ : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నామినేషన్ సెంటర్ను శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. 5.00 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు పరిశీలిస్తూ, స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నామినేషన్ల ప్రక్రియ ముగించాలని సూచించారు. అఫిడవిట్ లను నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్విఠల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు.
జూనియర్కాలేజీ తనిఖీ..
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ విద్యార్థులను ఆరా తీసి చాక్లెట్లను పంచారు. బాలికలను తన వద్దకు పిలిపించుకుని ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు.
