
- మొదటి రోజే యూనిఫాం, బుక్స్ పంపిణీకి చర్యలు
- ఉమ్మడి జిల్లాలో సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడంపై ఫోకస్
కామారెడ్డి/ నిజామాబాద్, వెలుగుసమ్మర్ హాలిడేస్ ముగియడంతో గురువారం స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బడిగంట మోగేందుకు అంతా రెడీ అయ్యింది. రీఓపెన్ రోజే గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులకు యూనిఫాం, టెక్ట్స్, నోటు బుక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చాలా వరకు బుక్స్ స్కూల్స్కు చేరగా, సగానికన్ని ఎక్కువగా యూనిఫాంలు కూడా వచ్చాయి.
గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకు బడి బాట కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకున్న పిల్లలను స్కూళ్లలో చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డ్రాపవుట్స్, ప్రైవేట్ స్కూళ్ల స్టూడెంట్లను కూడా ప్రభుత్వ బడుల్లో చేర్చుకోవటంపై ఫోకస్ పెట్టారు.
ఉమ్మడి జిల్లాలో 2,04,559 మంది విద్యార్థులు
ఉమ్మడి జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్లో 2, 04,559 మంది విద్యార్థులున్నారు. వీరికి ఉచితంగా టెక్స్ట్, నోట్ బుక్స్ ఇస్తారు. ఇప్పటికే 90 శాతం బుక్స్ స్కూల్స్కు చేరుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్, రెసిడెన్షియల్, కేజీబీవీ, మాడల్ స్కూల్స్ 1,081 ఉండగా ఇందులో 82,295 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 5.30 లక్షల టెక్ట్స్ బుక్స్ అవసరం కాగా 8,9 క్లాస్లకు సంబంధించి హిందీ తప్ప 4.77 లక్షల బుక్స్ స్కూల్స్కు చేర్చారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7,279 స్కూల్స్ఉన్నాయి. మొత్తం 1,22,264 మంది స్టూడెంట్స్కు 7,18,590 టెక్ట్స్ బుక్స్ అవసరం. ఇప్పటికే 6,88,310 బుక్స్చేరాయి.
యూనిఫాం కోసం ప్రభుత్వం సప్లై చేసిన క్లాథ్ను మహిళ సంఘాలకు ఇవ్వగా .. వారు స్టూడెంట్స్ సైజుల ప్రకారం డ్రెస్సులు కుట్టారు. కామారెడ్డి జిల్లాలో 80 శాతం వరకు, నిజామాబాద్ జిల్లాలో 40 శాతం వరకు తయారీ కంప్లీట్ అయ్యింది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో 66వేలు, నిజామాబాద్ జిల్లాలో 47,960 యూనిఫాంలు స్కూల్స్కు పంపారు. గురువారం నాడు ఒక్కో విద్యార్థికి ఒక జత యూనిఫాం ఇవ్వనున్నారు. రెండో జత వారం రోజుల్లో ఇవ్వాలని భావిస్తున్నారు.
టీచర్ల విస్తృత ప్రచారం..
గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థుల ప్రవేశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అంగన్వాడీల్లో ప్రీప్రైమరీ పూర్తయిన వారిని 1వ తరగతిలో చేర్చనున్నారు. బడి మధ్యలో మానేసిన వారిని కూడా తిరిగి స్కూళ్లలో చేరేలా మోటివేట్ చేస్తున్నారు. ఈ నెల 6 నుంచి బడిబాట పోగ్రాం జరిగింది. గ్రామాల్లో హెచ్ఎంలు, టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడిలో చేరాలని ప్రచారం చేశారు. స్కూల్స్ రిజల్ట్, వసతులు, ఫ్రీగా బుక్స్, యూనిఫాం పంపిణీ, మిడ్ డే మీల్స్తదితర అంశాలతో కరపత్రాలు పంచారు.
పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల స్కూళ్లలో సమస్యలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల క్లాస్ రూమ్స్ నిర్మాణం మధ్యలో అగిపోయింది. టాయిలెట్లు, టీచర్ల కొరత వేధిస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్ధుబాటు చేసుకొవచ్చని జిల్లా అధికారులకు ఇటీవల ప్రభుత్వం సూచించింది.
ఏర్పాట్లు చేశాం
స్కూల్స్ రీ ఓపెన్కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. బుక్స్ స్కూల్స్కు చేరాయి. యూనిఫాంలు 80 శాతం స్టిటింగ్ కంప్లీట్ చేసి స్కూల్స్కు ఇచ్చారు. ఫస్ట్ డేనే బుక్స్, నోటుబుక్స్, యూనిఫాంలు ఇస్తాం. అడ్మిషన్లు పెంచటానికి బడిబాటలో భాగంగా ప్రచారం చేశాం. - రాజు, డీఈవో కామారెడ్డి