
న్యూఢిల్లీ: రూపే క్రెడిట్ కార్డులను మరింతగా పెంచడంపై నేషనల్పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఫోకస్ పెడుతోంది. ఈ రంగంలోకి ఎన్పీసీఐ కొత్తగా అడుగు పెట్టింది. కొత్తగా జారీ అవుతున్న కార్డులలో తన వాటా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కిందటి ఏడాదిన్నర కాలంలో కొత్తగా జారీ అయిన క్రెడిట్ కార్డులలో 12 నుంచి 15 శాతం దాకా రూపే క్రెడిట్ కార్డులున్నాయని ఎన్పీసీఐ సీఓఓ ప్రవీణ రాయ్ చెప్పారు. రూపే గేట్వే ద్వారా రిటెయిల్ పేమెంట్లు, సెటిల్మెంట్లు జరిపేందుకు ఆర్బీఐ చొరవతో ఇండియన్ బ్యాంక్స్అసోసియేషన్ (ఐబీఏ) ఎన్పీసీఐని ఏర్పాటు చేసింది. డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు సెగ్మెంట్లలో మంచి పట్టు సాధించామని, ఇప్పుడు క్రెడిట్ కార్డు సెగ్మెంట్పై ఫోకస్ పెడుతున్నామని సీఓఓ వెల్లడించారు. రెండేళ్లుగా దేశంలోని క్రెడిట్ కార్డుల మార్కెట్లో జోరు పెరిగిందని రాయ్ చెబుతూ, అంతకు ముందు ఏడాదికి 4 కోట్ల కార్డులు జారీ అయ్యేవని, ఇటీవల అది ఆరున్నర కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మన దేశపు స్కీము కావడంతో చాలా మంది కస్టమర్లు రూపే కార్డులు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. టోకెనైజేషన్ బేస్డ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ల కోసం ఒక మోడల్ను డెవలప్ చేస్తున్నట్లు రాయ్ వెల్లడించారు.