
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.837.08కోట్లు జమ చేశామని హౌసింగ్ సీఈ ఎం.చైతన్య కుమార్ తెలిపారు. మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల పనులను పీడీ రవీంద్రనాథ్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఏడాది12,571.24 కోట్లు బడ్జెట్లో కేటాయించిందని, ఇప్పటి వరకు 3,14,408 ఇండ్లు సాంక్షన్ అయ్యాయన్నారు. ఇందులో 80,500 ఇండ్లు ఎస్సీలకు, 54 వేల ఇండ్లు ఎస్టీలకు కేటాయించినట్లు తెలిపారు.
1.98 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూర్, నార్నూర్ తదితర గిరిజన ప్రాంతాల్లో అదనంగా 22,016 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బెండాలపాడు గ్రామంలో 82 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.3 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. 27 ఇండ్లు కంప్లీట్ అయ్యాయని చెప్పారు.