శంషాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో మంగళవారం లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, కారోబార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శంషాబాద్ ఏసీబీ డీసీబీ భద్రయ్య తెలిపిన ప్రకారం.. నర్కుడ గ్రామంలో మధు అనే వ్యక్తి ఇంటిని నిర్మించేందుకు పంచాయతీ కార్యదర్శిని పర్మిషన్ కోరగా రూ. 65 వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని కొంచెం తగ్గించాలని బాధితుడు కోరాడు. రూ. 45 వేలకు కార్యదర్శి లక్ష్మీ నరసింహ, కారోబార్ నాగరాజుతో ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఈ నెల 2న ఆశ్రయించాడు.
మంగళవారం ప్లాన్ ప్రకారం కార్యదర్శి, కారోబార్ బాధితుడు మధు నుంచి రూ. 45 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సెక్రటరీ, కారోబార్పై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్టు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. సెక్రటరీ ఇంట్లో మరిన్ని సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అవినీతికి పాల్పడిన అధికారులను వెంటనే ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని స్థానికులు కోరారు.