
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై పాడి కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క. క్రమశిక్షణ కలిగి కాంగ్రెస్ వాదులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను, అమలు చేయడం కోసం అందరూ ముందుండి నడిపించాలని తెలిపారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ తప్పనిసరిగా ఆమోదించాలన్నారు. సోనియాగాంధీ నిర్ణయాన్ని అందరూ అమలు పర్చాలన్నారు. అంతేకాదు..తెలంగాణ ఇన్ చార్జి జనరల్ సెక్రెటరీ మాణిక్యం ఠాగూర్ పై డబ్బుల అభియోగాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రెస్ నోట్ లో తెలిపారు. ఇన్ ఛార్జి జనరల్ సెక్రెటరీ గా మాణిక్యం ఠాగూర్ తన పని తాను చేశారన్నారు. గత ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీలో కౌషిక్ రెడ్డి కి వచ్చిన 61,121 ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లున్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రేపు హుజరాబాద్ కు జరిగే ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఓట్లు చీలినా.. స్థిరమైన ఓట్ బ్యాంక్ తో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదంటూ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు భట్టి.