
- కులాలు పక్కనపెట్టి హక్కుల కోసం ఉద్యమించాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- రాష్ట్రంలో కులగణన సర్వేను శాస్త్రీయ పద్ధతిలో చేసినం
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లులను ఆమోదించుకున్నం
- బీసీ బిల్లులను కేంద్రం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్
బషీర్ బాగ్, వెలుగు: బీసీల్లో ఐక్యత లోపించిందని, పార్టీలకతీతంగా బీసీలు ఏకం కావాలని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కులాలను పక్కనపెట్టి హక్కుల కోసం ఉద్యమించాలని అన్నారు. ఐఏఎస్ నరహరి రచించిన ‘ఓబీసీల పోరుబాట’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్లోని నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.
ఈ కార్య క్రమంలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, అద్దంకి దయా కర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బీసీ నినాదాన్ని భుజానికి ఎత్తుకొని జోడో యాత్ర చేశారని తెలిపారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బీసీ కుల గణన సర్వే శాస్త్రీయబద్ధంగా నిర్వహించినట్టు చెప్పారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభల్లో రెండు బిల్లులను ఆమోదించామని తెలిపారు.
ఈ బిల్లులను కేంద్రం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సమాజహితం కోరుతూ ఐఏఎస్ అధికారి నరహరి ‘ఓబీసీల పోరుబాట’ పుస్తకం రాయడం అభినందనీయమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ సమాజానికి ఈ పుస్తకం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశంలోని ఓబీసీలంతా సంఘటితమై అధికారాన్ని చేజిక్కించుకోవాలని పుస్తక రచయిత, ఐఏఎస్ నరహరి పిలుపునిచ్చారు.
ఆ తర్వాత దానంతట అదే సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో 80 కోట్ల ఓబీసీల ఆశయాలు, ఆశలు , సమస్యలు, వాటి పరిష్కారాలపై ‘ఓబీసీల పోరుబాట’ పుస్తకాన్ని రాశానని తెలిపారు. కులగణన ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు.