అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త రూల్
న్యూఢిల్లీ: ఏటీఎంలలో క్యాష్ లేకపోతే బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లపై రూ. 10 వేల ఫైన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించనుంది. ఏటీఎంలలో క్యాష్ ఎంతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేసే విధంగా సిస్టమ్స్ తేవాలని వాటికి సూచించింది. ఈ కొత్త రూల్ను అక్టోబర్ 1 నుంచి అమలులోకి తేనున్నారు. ఒక నెలలో 10 గంటలకు మించి ఏటీఎంలలో క్యాష్ లేకపోతే ఈ రూ. 10 వేల పెనాల్టీ విధిస్తారు. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల విషయంలో పెనాల్టీని క్యాష్ నింపే బాధ్యత తీసుకున్న బ్యాంకులపైనే విధిస్తారు. ఆ తర్వాత ఈ పెనాల్టీని కావాలనుకుంటే బ్యాంకులు ఆ వైట్లేబుల్ ఏటీఎం ఆపరేటర్ నుంచి వసూలు చేసుకోవచ్చు. ఏటీఎంలలో క్యాష్ ఎంత టైము లేదనే విషయాన్ని ఆర్బీఐకి బ్యాంకులు ఇకమీదట నెలవారీగా తెలియ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెల మొదటి అయిదు రోజులలో ఈ రిపోర్టును ఆర్బీఐకి తప్పనిసరిగా పంపించాలి. అంటే అక్టోబర్ 1 నుంచి రూల్స్ అమలులోకి వస్తాయి కాబట్టి, నవంబర్ 5 లోపు పైన చెప్పిన విధంగా రిపోర్టును బ్యాంకులు ఆర్బీఐకి ఇవ్వాలి. ఆర్బీఐ రీజినల్ ఆఫీసులలోని ఇష్యూ డిపార్ట్మెంట్ ఇంఛార్జ్కు ఈ పెనాల్టీ విధించే అధికారాన్ని ఇచ్చారు. పెనాల్టీ విధింపుపై అభ్యంతరాలుంటే బ్యాంకులు, వైట్లేబుల్ ఆపరేటర్లు ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్లకు నెల రోజుల లోపు తెలియచేయొచ్చు.