ఇండియాకు ఐఎంఎఫ్ చీఫ్ విజ్ఞప్తి
దావోస్: గోధుమలపై విధించిన బ్యాన్ విషయంలో ఇండియా పునరాలోచించాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది పంటలు సరిగా పండలే, దిగుబడి అనుకున్నంత రాలేదన్న విషయం తనకు తెలుసని ఆమె చెప్పారు. అయితే, అంతర్జాతీయ ఆహార భద్రత విషయంలో ఇండియా చాలా కీలక పాత్ర పోషిస్తోందనే విషయం మరవొద్దని అన్నారు. ఇండియాను చూసి ఇంకొన్ని దేశాలు కూడా బ్యాన్ విధిస్తే ప్రపంచ దేశాలు ఆగమైతయని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల గోధుమల ఎగుమతులు ఆగిపోయి చాలా దేశాల్లో కొరత ఏర్పడిందని జార్జీవా వివరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో జార్జీవా ఈ కామెంట్స్ చేశారు.