
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్లో తెలుగు టాలన్స్ టీమ్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో టాలన్స్ 33–22 తేడాతో రాజస్తాన్ పాట్రియాట్స్పై నెగ్గింది. దీంతో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదో విజయంతో టాప్ ప్లేస్ను మరింత పదిలం చేసుకున్న తెలుగు టీమ్ సెమీస్ అవకాశాలను బాగా మెరుగుపర్చుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న టాలన్స్.. రాజస్తాన్ మ్యాచ్లోనూ తన హవా కొనసాగించింది. స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడుతూ వరుస గోల్స్తో హోరెత్తించింది. దేవిందర్ సింగ్ భుల్లార్, నసీబ్ సింగ్, రఘు, అనిల్, రాహుల్, మోహిత్ రాణించారు. గోల్ కీపర్ రాహుల్ కళ్లు చెదిరే రీతిలో రెండుసార్లు పాయింట్లను కాపాడాడు. చివరి 10 నిమిషాల్లో 10 గోల్స్ కొట్టిన టాలన్స్ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్లో తెలుగు టాలన్స్.. గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్తో తలపడుతుంది.