
- ఇష్టారీతిన పెంపు, కొరవడిన అధికారుల నియంత్రణ
- పిల్లల తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థికభారం
సిద్దిపేట మండలం రాంపూర్కు చెందిన నర్సింలు తన కొడుకును సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. మూడేళ్లుగా పంపిస్తున్నా ఈ ఏడాది ఫీజులు పెంచినట్టు స్కూల్యాజమాన్యం నర్సింలుకు తెలిపింది. ఐదో తరగతి చదివే తన కొడుకుకు ఏడాదికి రూ.50 వేల ఫీజుతో పాటు పుస్తకాలు, డ్రెస్సులు ఇతర ఖర్చుల కింద మరో రూ.10 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో ఇద్దరు పిల్లలున్న నర్సింలు ఫీజుల భారం భయంతో కొడుకును ప్రైవేట్ స్కూలుకు పంపాలా లేదా సర్కారు బడికి పంపాలా అనే సందిగ్ధంలో ఉన్నాడు. ఇది ఒక్క నర్సింలు ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రమే కాదు జిల్లాలోని చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో మొత్తం 200 పై చిలుకు ప్రైవేట్ స్కూల్స్ఉండగా వాటిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు దాదాపు లక్ష మంది స్టూడెంట్స్చదువుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి వరకు రూ. 30 నుంచి రూ.70 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండా క్రాష్కోర్సులు, ఐఐటీ ఫీజులు వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏటా ఒక్కో తరగతికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రైవేటు స్కూల్స్యాజమాన్యం పెంచుతోంది. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూల్స్ను ఏర్పాటు చేశారు. ఇటీవల కార్పొరేట్ స్కూల్స్ సైతం జిల్లాలో బ్రాంచీలను ఏర్పాటు చేస్తూ ఇష్టారీతిగా ఫీజులను వసూలు చేస్తున్నారు.
పుస్తకాల కొనుగోలు అదనపు భారం
ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజుల భారానికి తోడు పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, టై, బెల్ట్ కొనుగోళ్లు మరింత భారాన్ని పెంచుతున్నాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పుస్తకాల కోసం రూ.3 వేల నుంచి రూ.4 వేలు, ఐదు నుంచి పదో తరగతి వరకు రూ.9 వేల వరకు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలు తమ స్కూళ్లలోనే కొనుగోలు చేయాలని కొందరు, తాము సూచించిన బుక్షాపుల్లోనే కొనుగోలు చేయాలని మరి కొందరు పట్టుబట్టి కొనిపిస్తున్నారు.
ప్రభుత్వం సూచించిన సిలబస్ పుస్తకాలు వందల్లో ఉంటే ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు మాత్రం పబ్లిషర్ల పేరిట వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. గతంలో ప్రైవేట్ స్కూల్ ప్రాంగణాల్లో బుక్స్ విక్రయాలను నిషేధించిన ప్రభుత్వం గతేడాది లాభాపేక్ష లేకుండా పుస్తకాల్ని విక్రయించుకోవచ్చని ఉత్తర్వులు విడుదల చేయడంతో మళ్లీ దర్జాగా అమ్మకాలు సాగిస్తున్నారు.
తల్లిదండ్రుల కమిటీల ఊసేలేదు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్లో స్టూడెంట్స్ తల్లిదండ్రులతో కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఈ దిశగా ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ కమిటీలు సమావేశాలు నిర్వహించి ఫీజులను నిర్థారించాల్సి ఉన్నా దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. విద్యా సంవత్సరానికి ముందే ఫీజులను నిర్ణయించుకోవడమే కాకుండా ముందస్తుగానే అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. ఫీజుల వసూళ్లపై విద్యా శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న ఉదంతాలు ఎక్కడ కనిపించడంలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతీ ప్రైవేట్ స్కూల్ లో పాతిక శాతం పేద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వ నిబంధనలున్నా ఎక్కడా పాటించిన దాఖలాలు లేవు.
జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు
తరగతి వసూలు చేసే ఫీజు పుస్తకాలు
1 నుంచి 6 రూ.27000 నుంచి రూ.30000 రూ.3000 నుంచి రూ.4000
7 నుంచి 10 రూ.40000 నుంచి రూ.65000 రూ. 4000 నుంచి రూ.10000
అడ్మిషన్ ఫీజు రూ.2500 నుంచి రూ.3500
ఫీజుల భారం మోయలేక పోతున్నాం
ప్రైవేట్ స్కూల్స్ వసూలు చేస్తున్న ఫీజుల భారాన్ని మోయలేక పోతున్నాం. అధికారులు ఫీజులను నియంత్రించడంలో విఫలమవుతున్నారు. తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధిక ఫీజులను నియంత్రించి, నాణ్యమైన విద్యను అందించాలి.
రమణాకర్ రెడ్డి, సిద్దిపేట