
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో ఉత్తరం వైపు నూతనంగా నిర్మిస్తున్న కంపౌండ్ వాల్ కు ప్రజల సౌకర్యార్థం వాక్ వే గేట్స్ ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ కు ప్రజల నుంచి వినతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కంపౌండ్ వాల్ నిర్మిస్తున్న స్థలం నుంచి రెగ్యులర్ గా జర్నలిస్టుకాలనీ, విద్యానగర్ కాలనీ, హౌజింగ్ బోర్డు కాలనీ వాసులు బస్టాండ్ కు వెళ్తారు. కంపౌండ్ వాల్ పూర్తిగా నిర్మిస్తే బస్టాండ్ కు వచ్చి పోయే స్టూడెంట్స్కు, ఎంప్లాయిస్కు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి.
కంపౌండ్ వాల్కు రెండు చోట్ల వాక్ వే గేట్స్ నిర్మించి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంగళవారం జర్నలిస్టుకాలనీ కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ రవికుమార్ ను కలిసి కోరారు. వినతిపత్రాలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున వాక్ వే గేట్స్ ఏర్పాటు విషయమై ఉన్నతాధికారులకు వివరిస్తారని డిపో మేనేజర్ తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జర్నలిస్టుకాలనీ కమిటీ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, బాస మోహన్, రాజ్ కుమార్ ఉన్నారు.