
- ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తం
- 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తం
- కేవలం 2 గంటల్లో విజయవాడకు చేరుకోవచ్చని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అధునాతన టెక్నాలజీతో హైదరాబాద్ టు విజయవాడకు 8 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసి 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండు గంటల్లో చేరుకునేలా యాక్సిడెంట్ ఫ్రీ రహదారిని నిర్మిస్తామన్నారు.
హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్–విజయవాడ రోడ్డుపై యాక్సిడెంట్ల నియంత్రణ కోసం 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని గుర్తు చేశానని మంత్రి తెలిపారు.
ఈ 8 వరుసల రహదారి పనులు పూర్తయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్సిడెంట్ ఫ్రీ రోడ్డు అందుబాటులోకి వస్తుందన్నారు. అధునాతన టెక్నాలజీతో, పూర్తి నాణ్యతతో నిర్మించే ఈ రోడ్డు వల్ల విజయవాడ కు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 230 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ రోడ్డు పనుల డీపీఆర్ ఎస్టిమేట్స్ త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో గేమ్ చేంజర్ కానుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.