హైదరాబాద్–విజయవాడ మధ్య 8 లైన్లతో యాక్సిడెంట్ ఫ్రీ రోడ్డు

హైదరాబాద్–విజయవాడ మధ్య 8 లైన్లతో యాక్సిడెంట్ ఫ్రీ రోడ్డు
  • ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 
  • అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తం
  • 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తం
  • కేవలం 2 గంటల్లో విజయవాడకు చేరుకోవచ్చని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: అధునాతన టెక్నాలజీతో హైదరాబాద్​ టు విజయవాడకు 8 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  ప్రకటించారు. టెండర్  ప్రక్రియ కంప్లీట్​ చేసి 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండు గంటల్లో చేరుకునేలా యాక్సిడెంట్ ఫ్రీ రహదారిని నిర్మిస్తామన్నారు. 

హైదరాబాద్​లోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్​–విజయవాడ రోడ్డుపై యాక్సిడెంట్ల నియంత్రణ కోసం 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని గుర్తు చేశానని మంత్రి తెలిపారు. 

ఈ 8 వరుసల రహదారి పనులు పూర్తయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్సిడెంట్ ఫ్రీ రోడ్డు అందుబాటులోకి వస్తుందన్నారు. అధునాతన టెక్నాలజీతో, పూర్తి నాణ్యతతో నిర్మించే ఈ రోడ్డు వల్ల విజయవాడ కు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. 

హైదరాబాద్​లోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 230 కి.మీ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ రోడ్డు పనుల డీపీఆర్​ ఎస్టిమేట్స్ త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో గేమ్ చేంజర్  కానుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.