
- రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్
రంగారెడ్డి,వెలుగు: మైనర్లను పనిలో పెట్టుకుంటే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్- పై నిర్వహించిన మీటింగ్ లో ఆమె మాట్లాడారు. జులై 1 నుంచి 30 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్టు, బాల కార్మికులతోపాటు భిక్షాటన, చెత్త సేకరించుకునే బాలలు, వీధి బాలలను కూడా గుర్తిస్తున్నామన్నారు.
జిల్లాలో సైబరాబాద్, రాచకొండ పరిధిలో 11 ఆపరేషన్ ముస్కాన్ టీమ్ లు పని చేస్తున్నాయన్నారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆమె సూచించారు. జిల్లా శిశు సంక్షేమ అధికారి పద్మజా రమణ, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మెహన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరిదేవి, ఆర్డీఓలు సూరజ్ కుమార్, సాయిరామ్, అధికారులు పాల్గొన్నారు.